సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు

జనం న్యూస్: లైసెన్స్డ్ సర్వేయర్లను సీఎం రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ మాయమాటలునమ్మి చేస్తున్న ఉద్యోగాలు వదిలి వస్తే ఎకరానికి పది రూపాయల కమిషన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి 6,500 మంది యువత నడిరోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని మాజీమంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి తమ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయం వివరిస్తూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసకారి తీరును మాజీమంత్రి హరీశ్ రావు ఎండగట్టారు. లైసెన్స్డ్ సర్వేయర్లను రోడ్డున పడేసిన సీఎం రేవంత్ రెడ్డి. భూ భారతి పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500 మంది విద్యావంతులను లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి తీరా ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేయడం దారుణమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత, ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, గౌరవ వేతనం వస్తుందన్న ఆశతో తాము అప్పటికే చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి స్వయంగా వారికి మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, శిక్షణలు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారని కానీ పనుల్లోకి చేరాక మాట తప్పి మోసం చేశారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకుండా సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం పది రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలను అసెంబ్లీలో ఎండగడతాం. ఎకరం సర్వే చేస్తే పది రూపాయలా అంటే వీరు ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవలం 20 వేల రూపాయలేనా అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదేనా రేవంత్ రెడ్డి యువతకు ఇచ్చే ఉపాధి అని ప్రశ్నించారు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీకి పాల్గొనడం దుర్మార్గం అని అన్నారు. గత ఏడాది కాలంగా ఎలాంటి జీతం లేక, సరైన పని కల్పించక 6,500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *