సాక్షి డిజిటల్ న్యూస్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లపై భారత భద్రత బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లపై భారత భద్రత బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక నెల రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మొహమ్మద్కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే వీరిలో జైషే మొహమ్మద్కు చెందిన ఒక టాప్ కమాండర్ కూడా ఉన్నారు. వివరాలు… ఉగ్రవాద నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపే లక్ష్యంతో భారత భద్రతా బలగాలు అడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత బలగాలు ఆదివారం రోజున కిష్త్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అంతకుముందు ఫిబ్రవరి 4న ఉధంపూర్లోని రామనగర్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. గతంలో జనవరి 23న కథువాలోని పర్హేతార్ గ్రామంలో ఒకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ పరిణామాలు ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించే భారత బలగాల ప్రయత్నాల్లో కీలక పురోగతిని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యం కూడా ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే తమ ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను వెంబడించడం కొనసాగుతుందని… దేశ స్థిరత్వాని దెబ్బతీయాలని ప్రయత్నించేవారికి ఇక్కడ చోటు లేదని భారత సైన్యం తెలిపింది. అయితే ఆదివారం రోజున కిష్త్వార్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురిలో జైషే మొహమ్మద్ కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నారు. అయితే గతంలో అనేక ఎన్కౌంటర్ల నుంచి సైఫుల్లా తప్పించుకున్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఒక మట్టి ఇల్లులో దాక్కున్నారు. అదే సమయంలో ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో వారు మరణించారు. దీంతో ఉగ్రవాదులందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వారిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం సైఫుల్లా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడగా… అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలలో యాక్టివ్గా పాల్గొంటున్నాడు. భద్రతా దళాలపై అనేక ప్రాణాంతక దాడులకు సైఫుల్లా సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. అయితే సైఫుల్లా దాదాపు 17 సార్లు భద్రతా బలగాలకు చిక్కనట్టే చిక్కి, తప్పించుకున్నాడు.