ఇజ్రాయెల్‌ను భారత్‌ను అధికారికంగా గుర్తించిన రోజే నేను పుట్టాను.

*ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు *రెండోసారి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ *ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా రికార్డు *ఉగ్రవాదం విషయంలో పూర్తిగా సహాకారం ఉంటుందని హామీ

సాక్షి డిజిటల్ న్యూస్ : ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఆ దేశ పార్లమెంటులో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై పోరులో తమ మద్దతు పూర్తిగా ఉంటుందని ఇజ్రాయెల్‌కు మోదీ హామీ ఇచ్చారు. అక్టోబరు 7, 2023లో హమాస్ మారణహోమాన్ని.. ముంబయి ఉగ్రదాడులకు పోలీకలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌ ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించిన రోజే తాను జన్మించానని మోదీ చెప్పారు. ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. బుధవారం ఆ దేశానికి చేరుకున్న మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రెడ్డ్ కార్పెట్‌‌ వేసి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలూ ఇజ్రాయెల్ పార్లమెంట్‌ కెనెస్సెట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్ ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని, అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో తాము ఇబ్బంది పడుతున్నామని అన్నారు.ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిని తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. రెండోసారి ఇజ్రాయెల్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని షడ్భుజి కూటమిని భారత్‌తో కలిసి ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 2023 హమాస్ నరమేధాన్ని 26/11 ముంబయి మారణహోమంతో మోదీ పోల్చారు. ‘‘మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం. మీ బాధను మేము పంచుకుంటాం. ఆ క్షణం తర్వాత కూడా ఇజ్రాయెల్‌‌కు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుంది’’ అని మోదీ అన్నారు. భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు రక్తం, త్యాగాలతో లిఖింపబడిందని అన్నారు. మొదటి ప్రపంచ యుద్దంలో 4 వేల మందికిపైగా భారతీయ సైనికులు ఇదే ప్రాంతంలో అమరులయ్యారని, 1918 సెప్టెంబరులో హైఫా వద్ద జరిగిన అశ్వికదళ దాడి సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయిందని మోదీ గుర్తుచేశారు. అలాగే, ఇజ్రాయెల్‌ను ఇండియా అధికారికంగా గుర్తించిన రోజునే తాను పుట్టానని మోదీ తెలిపారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఇజ్రాయెల్ 1948లో ఆవిర్భించగా.. భారత్ దీనిని 1950 సెప్టెంబరు 17న గుర్తించింది. ఇక, ఇజ్రాయెల్ ప్రదాని నెతన్యాహు మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి మా దేశంలో పర్యటించడం ఎంతో సంతోషకరమని అన్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాల్లో గొప్ప నాయకుడైన మోదీ మాకు స్నేహితుడి కంటే ఎక్కువని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *