సర్కారు ఉద్యోగులకు భారీ ఊరట

* తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.

జనం న్యూస్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి ఆర్థిక భద్రత కల్పించే కొత్త ప్రమాద బీమా పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందులో కీలకమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం. రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రమాద బీమా పథకం వర్తించనుంది. సింగరేణిలో, ట్రాన్స్‌కోలో ఉద్యోగులకు విజయవంతంగా అమలు చేస్తున్న పథకం తరహాలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ. 1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల వరకు సహజ మరణానికి ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2.38 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది. క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రతకు క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3.56 లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య చికిత్సలు పొందవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ప్రైవేట్ ఎంపానెల్ హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు. ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం వాటాగా చెల్లిస్తే, అంతే సమాన మొత్తంలో ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు, అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా కలిపి మొత్తంగా రూ.1,056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయనుంది. వైద్య విధాన పరిషత్ పేరు మార్పు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (టీవీవీపీ) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా (డీఎస్‌హెచ్) మార్చాలని‌ నిర్ణయించింది. అలాగే,రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 గ్రామాలు. హెచ్ఎండీఏ విస్తరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనం… మంత్రివర్గ సబ్ కమిటీ నివేదిక మేరకు మెట్రో ఫేజ్ -1 ను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించి, మార్చిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఉండనుంది. రంగారెడ్డి జిల్లా కోహెడ‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటు కోసం 223.09 ఎక‌రాల భూమిని TGIIC బ‌ద‌లాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోని 239 ఎకరాల్లో ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *