మమతా బెనర్జీ నిర్ణయం

*హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదికి అవకాశం

సాక్షి డిజిటల్ న్యూస్ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మేనకా గురుస్వామి ఒకరు… తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయెల్ మల్లిక్ ఉన్నారు. అయితే ఈ నాలుగు స్థానాలు కూడా టీఎంసీ ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరిలో మేనకా గురుస్వామి… హైదరాబాద్‌కు చెందినవారు కాగా, ఆమెను తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… మేనకా గురుస్వామి సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేస్తూ 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులలో మేనకా గురుస్వామి కూడా ఒకరు. అయితే మేనకా గురుస్వామి కూడా ఎల్‌జీబీటీక్యూ. ఇప్పుడు మేనకా గురుస్వామి రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి బహిరంగ ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. మేనకా గురుస్వామి హైదరాబాద్‌లో జన్మించారు. మేనకా గురుస్వామి తల్లిదండ్రుల విషయానికి వస్తే… తండ్రి మోహన్ గురుస్వామి, తల్లి మీరా గురుస్వామి. మోహన్ గురుస్వామి గతంలో బీజేపీకి వ్యూహకర్తగా ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా వద్ద ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. ఇక, మేనకా భాగస్వామి అరుంధతి కట్జు కూడా ప్రముఖ న్యాయవాది. మేనకా గురుస్వామి తన ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. మేనకా గురుస్వామి తన న్యాయవాద వృత్తిని 1997లో ప్రారంభించారు. మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో పనిచేశారు. ఆయనను మేనకా గురుస్వామి తన గురువుగా భావిస్తారు. మేనకా గురుస్వామి ప్రధానంగా రాజ్యంగ అంశాలపై వాదనలు వినిపిస్తుంటారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రారంభించాక… ఉన్నత చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో బీసీఎల్, హార్వర్డ్‌లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. మేనకా గురుస్వామి 2001లో భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు. మేనకా గురుస్వామి… ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 2019 అత్యంత ప్రభావవంతమైన 100 మంది గ్లోబల్ థింకర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *