సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున ప్రియాంక గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిల మధ్య చర్చ జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయంపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని తెలిపారు. ఇదిలాఉంటే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం అని తెలిపారు. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని… భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. అదేవిధంగా… రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద – మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని చెప్పారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ… భవిష్యత్ లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ మున్సిపాలిటీలలోని 12 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా… ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. మక్తల్లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బుధవారం రోజున 2,569 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే… రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, 412 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది. 60కి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. హంగ్ ఏర్పడిన మరికొన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతుంది. తమకు అత్యధిక స్థానాలు లభించిన చోట స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్లలో (రామగుండం, మంచిర్యాల, నల్గొండ) కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రస్తుతం మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.