జనం న్యూస్: తెలంగాణపై కేంద్రప్రభుత్వం ఆర్థిక వివక్ష చూపిస్తోంది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు నిధుల్లో కోత ఇది ఫెడరలిజంపై దాడే అని అన్నారు. సొమ్ములు మావి గొప్పలు మీవా.? అని ప్రశ్నించారు. ప్రతిసారి మేమిచ్చాం, మేము తెచ్చాం అని అంటున్నారు, అది తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ కేంద్రానికి ఇచ్చేది రూ.1,33,208 కోట్లు.కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది కేంద్ర పథకాలతో కలిపి కేవలం రూ.51 వేల కోట్లు మాత్రమే’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు నేటి కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అన్యాయానికి గురవుతున్నాయని,ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.‘వికసిత్ భారత్’అనే నినాదం ఇస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష, నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ ఆదాయానికి దక్షిణాది వెన్నెముక. 2018–19 నుంచి 2022–23 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుండే పావుభాగానికి పైగా రూ. 22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయినప్పటికీ, ఈ స్థాయిలో ఆదాయం ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగి ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 16.3 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతుందని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ, ఇదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నారని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాకుండా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ‘ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షించడం, తక్కువ వసూళ్లు చేసే రాష్ట్రాలను ప్రోత్సహించడం కేంద్ర విధానంగా మారింది’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం చెప్పుకునే వికసిత్ భారత్ విధానం అంటే ఇదేనా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2024-25 లో తెలంగాణ రాష్ట్రం నుండి 1,33,208 కోట్ల పన్నులు వసూలు అయితే. కేంద్రం నుండి రాష్ట్రానికి కేంద్ర పన్నుల రూపంలో 27,050 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో 7,913 కోట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాల రూపంలో 16,762 కోట్లు మొత్తంగా 51,725 కోట్లు విడుదల చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.‘పథకాల రూపంలో వచ్చిన నిధులను కూడా కలిపితేనే ఈ మొత్తం వస్తోంది. స్వేచ్ఛగా వినియోగించుకునే నిధులు మాత్రం మరింత తక్కువ” అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. జీఎస్టీతో మొదలైన దెబ్బ గ్రాంట్ల కోతతో కొనసాగింపు. జీఎస్టీ సవరణల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఏడాదికి సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం దెబ్బతిన్నదని విమర్శించారు. రంగాలవారీగా, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెర పెట్టడం వల్ల తెలంగాణకు మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.