సాక్షి డిజిటల్ న్యూస్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ సైతం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఎస్ఐఆర్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగగా… మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ముందుగా తన వాదనను వినిపించడానికి ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని సీజేఐని మమతా బెనర్జీ కోరారు. ఇందుకు సీజేఐ అంగీకరించి… ఆమె మాట్లాడటానికి ఆమెకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ కీలక వాదనలు సీజేఐ ధర్మాసనం ముందు ఉంచారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇప్పటికీ ఎలాంటి సమాధానం లేదని చెప్పారు. తనకు న్యాయం జరగలేదని అన్నారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘మూసిన తలుపుల వెనుక న్యాయం రోదిస్తోంది’’ అని కూడా మమతా బెనర్జీ అన్నారు. ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తన విమర్శలను కొనసాగించారు. అలాగే, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్, ప్రఖ్యాత బెంగాలీ కవి జాయ్ గోస్వామి, తృణమూల్ ఎంపీ దీపక్ అధికారి సహా పలువురు ప్రముఖులకు ఎస్ఐఆర్ నోటీసులు పంపారని మమతా బెనర్జీ లిఖితపూర్వకంగా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మమతా బెనర్జీ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.