యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే

*సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల నోటిఫై చేసిన ‘ఈక్విటీ రెగ్యులేషన్స్’ అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల నోటిఫై చేసిన ‘ఈక్విటీ రెగ్యులేషన్స్’ అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. యూజీసీ తాజాగా ప్రకటించిన ఈక్విటీ రెగ్యులేషన్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిబంధనల అమలును నిలిపివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. పాత నిబంధనలే ప్రస్తుతానికి కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. వివరాలు… యూజీసీ జనవరి 13న నోటిఫై చేయబడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం) నిబంధనలు, 2026ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, అగ్రవర్ణ విద్యార్థులకు వ్యతిరేకంగా వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిటిషనర్లు ఆరోపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపిస్తూ… కుల ఆధారిత వివక్షను చర్చించే యూజీసీ నిబంధనలలోని సెక్షన్ 3Cని తాము సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలలో ఇవ్వబడిన వివక్ష నిర్వచనం పూర్తిగా తప్పు అని, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం… వివక్ష దేశంలోని పౌరులందరికీ వర్తిస్తుందని అన్నారు. అయితే యూజీసీ చట్టం నిర్దిష్ట తరగతుల పట్ల వివక్షను మాత్రమే ప్రస్తావిస్తుందని… ఇది సుప్రీంకోర్టు మునుపటి ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇది సమాజంలో శత్రుత్వాన్ని పెంచుతుందని… రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వ సూత్రానికి విరుద్ధమని అన్నారు. ఈ పిటిషన్‌లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా మనం మన సమాజాన్ని కులతత్వం నుంచి విముక్తి చేయలేకపోయామని… ఇప్పుడు ఈ కొత్త చట్టంతో మనం వెనక్కి వెళ్తున్నామా? అని సీజేఐ ప్రశ్నించారు. సామాజిక పరిణామాలను అరికట్టేందుకు కోర్టు జోక్యం అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ‘‘మనం జోక్యం చేసుకోకపోతే అది ప్రమాదకరమైన ప్రభావానికి దారి తీస్తుంది… సమాజాన్ని విభజిస్తుంది, తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని… దానిని దుర్వినియోగం చేయకుండా నిపుణులు సమీక్షించి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *