పయనించే సూర్యుడు న్యూస్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మేడారం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవాల ప్రారంభం పురస్కరించుకుని, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ గడ్డ త్యాగానికి, ఆత్మగౌరవానికి, అన్యాయంపై ఎదిరించే ధిక్కారానికి ఈ ఆదివాసీ దేవతలు నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించే తమ ఇలవేల్పులకు మొక్కులు చెల్లించుకునేందుకు దేశ నలుమూలల నుంచి కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోందని, ఈ జనసందోహం కుంభమేళాను తలపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో జరిగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని స్మరించుకుంటూ, సబ్బండ వర్గాల సంస్కృతికి తమ పదేళ్ల పాలనలో సముచిత గౌరవం, ప్రాధాన్యత దక్కిందని కేసీఆర్ గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆదివాసీ, గిరిజన సమాజాల ఆచార వ్యవహారాలకు, సంస్కృతికి పెద్దపీట వేసిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గోదావరి లోయ ప్రాంత ప్రగతితో సమాంతరంగా ఆధ్యాత్మిక రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి పుంజుకోవాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించేలా దీవించాలని ఆ సమ్మక్క-సారలమ్మ దేవతలను తాను మనసారా ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల కష్టాలు తీర్చే శక్తి ఆ వనదేవతలకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అటవీ ప్రాంతంలో రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. కాకతీయ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, పన్నుల భారాన్ని ఎదిరించి పోరాడిన తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మల పరాక్రమానికి ఇది ప్రతీక. ఈ జాతరలో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్లకు తమ బరువుకు సరిపడా ఎత్తుబెల్లం (బంగారం) సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆనవాయితీ. కేవలం తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.