భారత్-ఈయూ ఒప్పందం ప్రపంచానికి కొత్త దిక్సూచి

* ప్రధాని వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, Ursula von der Leyen, António Costa కలిసి భారత్-ఈయూ FTAపై చర్చించారు. ఉక్రెయిన్, గాజా, పశ్చిమాసియా సమస్యలపై శాంతి, దౌత్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అస్థిరత, అలజడి నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్, ఐరోపా సమాఖ్య (EU) మధ్య కుదిరిన సహకారం అంతర్జాతీయ వ్యవస్థలో నిలకడను తెస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి మోదీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ఆయన “భవిష్యత్తు ఉమ్మడి ప్రగతికి సరికొత్త బాట”గా అభివర్ణించారు. వాణిజ్యం, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల విషయంలో ఇదొక చారిత్రక రోజని ప్రధాని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. అంతర్జాతీయ సంస్థల్లో కాలానికి అనుగుణంగా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, బహుపాక్షిక విధానాలను గౌరవించడం తమ ఉమ్మడి బాధ్యత అని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు తాము కట్టుబడి ఉన్నామని ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాలకు భంగం కలగకుండా న్యాయబద్ధమైన, శాశ్వత శాంతి పరిష్కారం కోసం భారత్ సహకారం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి కోసం ఉక్రెయిన్ క్లిష్టమైన రాజీలకు కూడా సిద్ధపడిందని ఆయన గుర్తుచేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు అనుగుణంగా యుద్ధానికి ముగింపు పలకాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. గాజా సంక్షోభంపై కూడా నేతలు కీలక చర్చలు జరిపారు. 2025 నవంబర్‌లో ఆమోదించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803ను ఇరు దేశాలు స్వాగతించాయి. ఈ తీర్మానం ద్వారా అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాన్ని ఏర్పాటు చేయడం, ‘బోర్డ్ ఆఫ్ పీస్’ స్థాపించడం ముందడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు రెండు దేశాల ఏర్పాటు (టూ-స్టేట్ సొల్యూషన్) ఒక్కటే శాశ్వత పరిష్కారమని నేతలు అభిప్రాయపడ్డారు. దౌత్యం ద్వారానే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమని వారు పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో పాటు ఆ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపైనా ఇరు పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చర్చలే సరైన మార్గమని స్పష్టం చేశాయి. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందం.. ఇరు ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపిరి పోయనుందని విశ్లేషకులు అంటున్నారు. ఈయూతో భారత్ బంధం వాణిజ్యానికే పరిమితం కాకుండా, ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *