అసెంబ్లీ హాజరుపై స్పీకర్ వ్యాఖ్యలు

* ‘నో వర్క్ – నో పే’ విధానం అవసరం.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు సభకు హాజరుకాని ఎమ్మెల్యేలకు నో వర్క్ – నో పే విధానం ఉండాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రజల పట్ల శాసనసభ జవాబుదారీతనం’’ అనే అంశంపై అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. 2024 జూన్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు కొందరు ఎమ్మెల్యేలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని, ఒక్క రోజు కూడా శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం, చర్చలో కూడా పాల్గొనకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలు ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉందని తెలిపారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనపై అందరూ ఆలోచన చేయాలని కోరారు. ఇలాంటి సభ్యుల వ్యవహారశైలిని నిషేధించే నిబంధనలేవీ లేవని. మరొక మార్గం చూపించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని అన్నారు. ‘‘ఈ విషయంలో నా వైపు నుంచి రెండు సూచనలు చేస్తున్నాను. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలకు నో వర్క్ – నో పే విధానం ఉండాలి. అసెంబ్లీకి రానివారికి వేతనం ఎందుకు ఇవ్వాలి? అనేదే నా పాయింట్. రెండోది… అప్పటికి వారు గుణపాఠం నేర్చుకోకపోతే, మరో అడుగు ముందుకు వేసి వారిని ప్రజా కోర్టులో నిలబెట్టాలి. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి. రైట్ టూ రీకాల్ చట్టాన్ని తీసుకురావాలి’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శాసన వ్యవస్థ అత్యంత పారదర్శకంగా పనిచేయడానికి రాజ్యాంగం రూపొందించబడిందని. లోపల జరిగే ప్రతిదీ కనిపించడం వల్ల దీనిని తరచుగా గ్లాస్ హౌస్‌తో పోలుస్తారని అయ్యన్న పాత్రుడు అన్నారు. పారదర్శకత లేని ఏ వ్యవస్థ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. బిల్లులపై చర్చల ద్వారా చట్టాలను రూపొందించడం, ప్రజా సమస్యలపై చర్చించడం, ప్రజలకు సంబంధించిన అత్యవసర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉంచడం వంటివి శాసన వ్యవస్థ యొక్క కొన్ని ప్రధాన విధులని ఆయన గుర్తుచేశారు. ఇంతటి బాధ్యతలు, అధికారాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులపై ప్రజల నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని అన్నారు. ఇది తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రజలు చిన్నచూపు చూసేలా తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అయితే, ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేకు గైర్హాజరు కావడంపై ఇప్పటికే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఇది సరైన పద్దతి కాదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా జాతీయ వేదికగా వైసీపీ సభ్యుల తీరును ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *