ట్రంప్ టారిఫ్‌లకు భారత్ సైలెంట్ కౌంటర్!

* ట్రంప్ టారిఫ్‌లకు సైలెంట్‌గా చెక్ పెడుతున్న భారత్! * అమెరికా పప్పు ధాన్యాలపై 30 శాతం టారిఫ్ విధింపు

పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీనికి దీటుగా భారత్ కూడా ప్రతిస్పందించిందని తెలుస్తోంది. గతేడాది నవంబర్ 1 నుంచి అమెరికా పప్పు ధాన్యాలపై 30 శాతం సుంకాలు విధించింది భారత్. ఈ చర్య అమెరికా రైతులకు నష్టం కలిగించడంతో.. ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఈ సుంకాల నుంచి ఉపశమనం కలిగించేలా భారత్‌తో చర్చించాలని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో భారత్‌‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌కు కూడా తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తోందని మరో సాకు చెప్పింది. భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలుజరుగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్‌ల ప్రకటన చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపులకు భారత్‌ కూడా సైలెంట్‌గా ప్రతిస్పందించిందని తెలుస్తోంది. అమెరికా పప్పు ధాన్యాలపై 30 శాతం సుంకాలు విధించింది. అమెరికా పేరు ఎత్తకుండానే, దౌత్య పరమైన గందరగోళం నెలకొనకుండానే.. నిశ్శబ్దంగా అమెరికాకు దీటైన సమాధానం ఇచ్చింది భారత్. అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి అవుతున్న పప్పు ధాన్యాలపై 2025 నవంబర్ 1 నుంచి.. భారత్‌ 30 శాతం (10% బేసిక్ డ్యూటీ + 20% అగ్రికల్చరల్ సెస్) సుంకాలు విధించింది. ఈ మేరకు గతేడాది అక్టోబర్ 30న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచదేశాలకు వర్తించేలా టారిఫ్‌లు విధించింది భారత్. అయితే దీని వల్ల అధికంగా నష్టపోయింది మాత్రం అమెరికానే అని నిపుణులు చెబుతున్నారు. ఈ టారిఫ్‌లను తొలగించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలని అమెరికన్‌ సెనేటర్లు ఇద్దరు 2026 జనవరిలో ట్రంప్‌ను కోరగా.. ఈ విషయం పబ్లిక్‌లోకి వచ్చింది. సేనేటర్లు ఈ టారిఫ్‌లు అనుచితమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై భారత్‌తో చర్చలు జరిపి.. ఉపశమనం కల్పించాలని నార్త్‌ డకోటా సెనెటర్‌ కెవిన్‌ క్రామర్‌, మొంటానా సెనెటర్‌ స్టీవ్‌ డైనెస్‌ ట్రంప్‌కు లేఖ రాశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో.. అమెరికన్‌ పప్పు ధాన్యాలకు మెరుగైన మార్కెట్‌ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. నార్త్ డకోటా, మోంటనా.. అమెరికాలోనే ఎక్కువగా పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. ఇక భారత్.. ప్రపంచంలోకెల్లా అధికంగా వాటిని వినియోగిస్తుంది. అందువల్ల భారత్ విధించిన సుంకాలతో రాత్రిరాత్రే అమెరికా పప్పు ధాన్యాల మార్కెట్ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. కాగా, ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పప్పుధాన్యాలపై తక్కువ పన్నులు విధించాలని భారత ప్రధానిని కోరగా.. మోదీ దానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు భారత్‌పై ట్రంప్ ఇష్టారీతిన సుంకాలు విధిస్తే.. భారత్‌ కూడా నిశ్శబ్దంగా పన్నులను 30 శాతాని పెంచడం గమనార్హం. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. అమెరికన్ చట్టసభ సభ్యులు భారత్ విధించిన సుంకాలను అన్యాయం అని అంటున్నారు. భారత్ తన ప్రయోజనాలను చట్టబద్ధంగా కాపాడుకుంటుంటే.. అమెరికా మొసలి కన్నీరు కారుస్తుండటం హాస్యాస్పదం అని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యల ద్వారా.. రైతుల విషయంలో చర్చలకు తావు లేదనే విషయాన్ని భారత్ సుస్పష్టం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *