గ్రోక్ జనరేట్ చేసిన కంటెంట్ తొలగించాలి: ఎక్స్‌కు కేంద్రం 72 గంటల గడువు

పయనించే సూర్యుడు న్యూస్ : ఎక్స్‌లో దాని ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ద్వారా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ వ్యాప్తి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం 72 గంటల అల్టిమేటం జారీ చేసింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్స్‌లో దాని చాట్‌బాట్ గ్రోక్ ద్వారా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ వ్యాప్తి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం 72 గంటల అల్టిమేటం జారీ చేసింది. గ్రోక్ ద్వారా జనరేట్ చేయబడుతున్న అశ్లీల, అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్‌ భారత కార్యకలాపాల చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఉండాల్సిన ‘డ్యూ డిలిజెన్స్’ (ముందస్తు జాగ్రత్తలు) పాటించడంలో ఎక్స్ విఫలమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులో పేర్కొంది. ముఖ్యంగా గ్రోక్ ఏఐ ద్వారా మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు సృష్టించబడుతున్నాయని దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. చట్టాలను చట్టాలను ఉల్లంఘించి ఇప్పటికే జనరేట్ చేయబడిన లేదా వ్యాప్తి చేయబడిన కంటెంట్ మొత్తానికి యాక్సెస్‌ను తీసివేయడం లేదా నిలిపివేయడం చేయాలని… ఐటీ రూల్స్ 2021 సూచించిన టైమ్‌లైన్‌కు అనుగుణంగా ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అలాగే, ఏ విధంగానూ సాక్ష్యాలను పాడుచేయకూడదని కూడా పేర్కొంది. కేంద్రం జారీ చేసిన నోటీసులపై స్పందించేందుకు 72 గంటల సమయం ఇచ్చిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ జనరేట్ చేయకుండా ఉండేందుకు.. సాంకేతిక, విధానపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను సమగ్రంగా సమీక్షించాలని ఎక్స్‌ను కోరింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన సేవా నిబంధనలు, ఏఐ వినియోగ విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. గ్రోక్ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే అటువంటి అకౌంట్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి బలమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ‘‘మీరు అభివృద్ధి చేసి, ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించి అందుబాటులో ఉంచిన ‘గ్రోక్ ఏఐ’ చాట్‌బాట్‌ను వినియోగదారులు దుర్వినియోగం చేస్తూ, మహిళల అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను అవమానకరమైన లేదా అసభ్యకరమైన రీతిలో జనరేట్ చేస్తున్నారు. తర్వాత వాటిని షేర్ చేయడానికి నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారని ప్రత్యేకంగా గుర్తించాం’’ అని కేంద్రం నోటీసుల్లో పేర్కొంది. నిర్దేశించిన గడువులోగా స్పందించకపోతే ఎక్స్ ప్లాట్‌ఫారమ్ తనకు ఉన్న చట్టపరమైన రక్షణను (Safe Harbour) కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులు చేసే పోస్ట్‌లకు ప్లాట్‌ఫారమ్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద శిక్షార్హమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *