పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ సమీక్షలో ఫెర్రో అల్లాయ్స్ ప్రోత్సాహం, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, EV బస్సులు, 5 వేల ఛార్జింగ్ స్టేషన్లు, కొత్త ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుదుత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పొడిగింపు వల్ల ప్రభుత్వంపై ₹1,053 కోట్ల భారం పడనుంది. విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో గత పాలకులు పీపీఏల రద్దు ద్వారా ప్రజలపై మోపిన ₹9 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం జీరో చేసిందని సీఎం వివరించారు. విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించాలని ఆదేశించారు. పీఎం కుసుమ్, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాల కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. సౌర విద్యుత్కు అగ్ర ప్రాధాన్యత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అగ్ర స్థానం ఇచ్చారు. 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేవాదాయ, జలవనరుల శాఖలకు చెందిన భూముల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. వినియోగదారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసి, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఆదాయం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే సోలార్ రూఫ్ టాప్ సౌర ప్యానెల్లు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ వినియోగదారుకు 3 కిలోవాట్ల వరకూ ₹20 వేల సబ్సిడీ అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. చేనేతలకు ప్రకటించిన 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేయాలని ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు 60 రోజుల్లో అనుమతులు రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు ఐస్ (ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఒక న్యూ ఎనర్జీ హబ్గా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మూలధన రాయితీ, జీఎస్టీ మినహాయింపు సహా 9 అంశాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లలో వ్యయం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్కు 20 పైసల చొప్పున కొనుగోలు వ్యయం తగ్గించినట్లు సీఎస్ కె.విజయానంద్ వివరించారు. ఈపీఎంఎస్ విధానంతో నిరంతర పర్యవేక్షణ ద్వారా ₹400 నుంచి 500 కోట్ల మేర పొదుపు చేయగలిగామని తెలిపారు. ఆర్టీసీకి వెయ్యి ఈవీ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు రాష్ట్రంలో ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు (PSP) ఏర్పాటు చేసే అవకాశాలను జెన్కో ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పీఎస్పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు. గత పాలకులు తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయంతో ₹9 వేల కోట్ల భారం ప్రజలపై పడిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. విద్యుత్ను వినియోగించుకోకుండానే ఆయా విద్యుత్ కంపెనీలకు ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్ వ్యవస్థలను గాడిలో పెట్టామని, సమర్థ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామని సీఎం వివరించారు. విద్యుత్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ప్రతీ ఏటా హ్యాకథాన్ నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్, ట్రాన్స్ కో, జెన్కో, డిస్కమ్ సీఎండీలు హాజరయ్యారు.