సీఎం సొంతూరులోనే సర్పంచ్ ఏకగ్రీవం

* సర్పంచ్ పదవికి పోటీ పడిన 15 మంది * రేవంత్ రెడ్డి చేత కాంగ్రెస్ ఖాతా ఓపెన్! * రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో సర్పంచ్ ఏకగ్రీవం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్థులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో 42 శాతం బిసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత నడుమ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో.. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ పదవులపై కన్నేసిన కొందరు ఆశావాహులు.. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు ప్రారంభించారు. గ్రామంలో గుడి, బడి వంటి వాటికి పెద్దమొత్తంలో నిధులిస్తామని చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరులో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్ పదవి కోసం 15 మంది పోటీ పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామంలోని పెద్దలంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. అయితే ఎన్నిక ఏకగ్రీవమైనప్పటికీ.. సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. సర్పంచ్ పదవిని ఆశిస్తున్న 15 మందిలో.. ఒకరి పేరును సీల్డ్ కవర్‎లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీంతో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లైంది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరుతో కాంగ్రెస్ పార్టీ ఖాతా ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొండారెడ్డిపల్లి మాత్రమే కాకుండా ఇప్పటికే కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు. అయితే గ్రామంలో ఆ రిజర్వేషన్ కేటగిరీకి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం మాత్రమే ఉంది. దీంతో ఆ ఫ్యామిలీకి జాక్‌పాట్ తగిలినట్లు అయింది. ఎరుకలి భీమప్పకు భార్య వెంకటమ్మ ఇద్దరు కుమారులు ఎల్లప్ప, మహేష్ ఉన్నారు. రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్‌తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ.. రెండు వార్డు రిజర్వేషన్లు వచ్చాయి. అంటే భీమప్ప కుటుంబం నుంచే సర్పంచ్‌తో పాటు ఇద్దరు వార్డు సభ్యుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైంది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం రాఘవాపురంలో సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే ఆ గ్రామంలో మొత్తం 471 ఓట్లు ఉండగా.. ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి కాంపల్లి కోటమ్మ, కుమారుడు రమేశ్ మాత్రమే ఉన్నారు. సర్పంచ్‌తో పాటు 4వ వార్డు కూడా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అంటే తల్లి సర్పంచ్‌గా, కుమారుడు వార్డు సభ్యుడిగా ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *