
జనం న్యూస్: నా రాజకీయ ప్రస్థానం పరకాల నుండే మొదలవుతుంది అని మంత్రి కొండా సురేఖ తనయ కొండా సుష్మిత పటేల్ ప్రకటించారు. కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుండే మొదలైంది అన్న ఆమె తాను కూడా పరకాల నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతాను అని కొండా సుష్మిత పేర్కొన్నారు పొలిటికల్ ఎంట్రీపై మంత్రి కొండా సురేఖ తనయ కొండా సుష్మిత పటేల్ సంచలన ప్రకటన చేశారు. తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే ప్రారంభం అయ్యిందని తాను కూడా ఇక్కడ నుంచే రాజకీయ ప్రస్థానం మెుదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని కొండా సుస్మిత ప్రకటించారు. తన తల్లిదండ్రులు కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైందని తాను కూడా ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేస్తానని కొండా సుష్మిత పేర్కొన్నారు. పరకాల నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందుతానంటూ కొండా సుష్మిత వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే తండ్రి కొండా మురళీ ఉండటం విశేషం. మాకు అన్నం పెట్టింది పరకాల ప్రజలే: కొండా మురళి. మరోవైపు కొండా సుష్మిత చాలా ధైర్యవంతురాలు అని తండ్రి కొండా మురళి పేర్కొన్నారు. తన కంటే ధైర్యవంతురాలని కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కుంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భరోసా ఇచ్చారు. వాడెవడు వీడెవడు కొండా మురళికి ఎదురెవ్వడు అంటూ ప్రకటించింది కూడా సుష్మితయేనని చెప్పుకొచ్చారు.ఇటీవలే నా ఇంటి ముంగిట చూశారు కదా ఏ చేసిందో. ఎవడిని పడితే వాడిని తిడతాది. వాడు వీడు అని చూడదు. కార్యకర్తల కోసం ఏదైనా చేస్తది. నాకు, నా కుటుంబానికి అన్నం పెట్టింది పరకాల ప్రజలే. చావు నుంచి బయటపడింది మీ వల్లే. కాబట్టి ఈ పరకాల ప్రజల రుణం తీర్చుకోలేనిది అని కొండా మురళి అన్నారు. గతంలోనూ కామెంట్స్ చేసిన సుష్మిత. గతంలో కూడా కొండా సుష్మిత ఇదే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీనిపై అధిష్టానానికి వివరణ సైతం ఇచ్చుకున్నారు కొండా మురళి. అలాంటిది తన సమక్షంలోనే తన కుమార్తె సుష్మిత పటేల్ తన రాజకీయ ప్రస్తానం గురించి ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గతంలో సుష్మిత చేసిన ప్రకటనపై కొండా మురళి దాటవేత ధోరణి ప్రదర్శించారు. తన కుమార్తె సుష్మిత ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు అని వివరణ ఇచ్చారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.. మా కూతురు అనుకునేది నాకు తెలియదు.. మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదు’అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు.