
జనం న్యూస్: కర్నూలు విద్యార్థులకు ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్న్యూస్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీ పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీపై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో కర్నూలు క్లస్టర్ వర్సిటీని పూర్తి చేస్తాం అని ప్రకటించారు.ఈ క్లస్టర్ వర్సిటీకి సంబంధించి ఇప్పటికే రూ.139 కోట్లు మంజూరు కాగా...అందులో రూసా పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చుచేయడం జరిగింది అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ‘శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. క్లస్టర్ యూనివర్సిటీలో పెండింగ్ పనులు పూర్తిచేయడానికి రూ.74.5 కోట్లు అవసరమని తెలిపారు. ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్ అప్రోచ్ తో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం వర్టికల్ – హారిజంటల్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉంది. అవసరమైన ఎకో సిస్టమ్ ను అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంది’అని మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. క్లస్టర్ వర్సిటీని త్వరలోనే పూర్తి చేస్తాం. ‘కర్నూలు పార్లమెంటులో కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషలైజేషన్ పై దృష్టిసారించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం’అని ఏపీ విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అసెంబ్లీలో క్లస్టర్ యూనివర్సిటీపై మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను ఒకే గూటికిందకు తెచ్చి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చొరవచూపి రూసా పథకం కింద రూ.55 కోట్లు మంజూరు చేయించి, పనులు చేపట్టారు. భవనాల నిర్మాణం చేపట్టి ఎంఎస్ వైరాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఎంసీఏ వంటి కోర్సులు ప్రారంభించేందుకు జగన్నాథగట్టు పక్కన 50ఎకరాల్లో క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. కాంట్రాక్టర్ సెక్యూరిటీని కూడా తొలగించడంతో అక్కడి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. తక్షణమే అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తిచేసి, కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే చరితారెడ్డి విజ్ఞప్తి చేశారు.