జనం న్యూస్: మధిరను రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాగే అత్యంత నివాసయోగ్యమైన పట్టణంగా మారుస్తామని చెప్పారు. మధిరను రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాగే అత్యంత నివాసయోగ్యమైన పట్టణంగా మారుస్తామని చెప్పారు. సోమవారం రోజున మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నికైన సామినేని సుజాత, వైస్ చైర్మన్గా ఎన్నికైన కోన ధని కుమార్లకు, నూతన కౌన్సిలర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం పార్టీపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత లక్ష్యంగా మధిర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మధిరలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీ కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని, తమకు మద్దతుగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల్లో గెలిచి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలు ఉండకూడదని. ‘‘నో పాలిటిక్స్ ఓన్లీ డెవలప్మెంట్’’ అనే నినాదంతో మధిర పట్టణాన్ని అబివృద్ది చేసుకొందామని పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధిలో మేధావులను, పెద్దలను భాగస్వాములను చేస్తూ త్వరలోనే ఒక ‘‘డెవలప్మెంట్ కమిటీ’’ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రతి 15 రోజులకు లేదా కనీసం నెలకు ఒకసారి అభివృద్ధి పనులను తాను సమీక్షిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ను సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ధ్యేయం అని తెలిపారు. పారిశ్రామికీకరణతో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో పట్టణాల్లో మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్యూర్, క్యూర్, రేర్ మోడల్ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంతో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ఆర్థిక దిగ్గజంగా నిలబెట్టే దిశగా దృఢంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.