11 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తెలంగాణ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ మున్సిపాలిటీలలోని 12 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా... ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. మక్తల్‌లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బుధవారం రోజున 2,569 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్‌ల విషయానికి వస్తే... రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, 412 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న చేపట్టారు.ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ హవా కనబరిచింది. కొన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే 30కి పైగా మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. ఇక, మన్సిపల్ కార్పొరేషన్‌ల విషయానికి వస్తే... మూడు చోట్ల (రామగుండం, మంచిర్యాల, నల్గొండ) కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. మిగిలిన నాలుగు కార్పొరేషన్‌లలో (మహబూబ్ నగర్, కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్) హంగ్ ఫలితాలు వచ్చాయి. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలవగా... కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ సమాన స్థాయిలో సీట్లను దక్కించుకున్నాయి. ఇక, కరీంనగర్, నిజామాబాద్‌లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే సోమవారం (ఫిబ్రవరి 16) రోజున మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ , మున్సిపల్ కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక నిర్వహించారు. పరోక్ష పద్దతిలో ఎన్నిక నిర్వహించారు. అయితే 116 మున్సిపాలిటీలలోని 105 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికల ఈరోజు పూర్తైంది. అయితే 11 మున్సిపాలిటీలలో వివిధ కారణాల వల్ల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌‌ల ఎన్నిక వాయిదా పడింది. ఆ జాబితాలో ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, క్యాతనపల్లి, ఖానాపూర్‌, జహీరాబాద్‌, ఇంద్రేశం, డోర్నకల్‌, జనగామ, తొర్రూర్‌ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలు తదుపరి ఎప్పుడు నిర్వహించనున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్‌లకు సంబంధించి రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండలలో మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు కాంగ్రెస్‌కు దక్కాయి. నిజామాబాద్‌లో ఎంఐఎం మద్దతు తీసుకున్న కాంగ్రెస్ అక్కడ మేయర్‌ పదవిని తీసుకుని, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించింది. ఇక, కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠం పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది. అయితే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మాత్రం బీజేపీ జెండా ఎగరవేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులను బీజేపీ దక్కించుకుంది.