
పయనించే సూర్యుడు న్యూస్ : నూతన ప్రపంచ వ్యవస్థ వైపు ప్రపంచం పరుగులుతీస్తున్న వేళ భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్ గా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026కు ప్రధాని హాజరయ్యారు. నూతన ప్రపంచ వ్యవస్థ వైపు ప్రపంచం పరుగులుతీస్తున్న వేళ భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్ గా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026కు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ స్వాగతం పలికారు. ఈ వేదికపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. అయితే ఏడు దశాబ్దాల తర్వాత ఆ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని... ప్రపంచం నేడు మరో కొత్త వ్యవస్థ వైపు పయనిస్తోందని అన్నారు. ప్రపంచం నేడు మాట్లాడుతున్న ‘‘శతాబ్దపు పరివర్తన’’కు భారతదేశం బలమైన పునాది వేయడానికి సిద్ధంగా ఉందని, రాబోయే సంవత్సరాల్లో, భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఇంజిన్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో సాంకేతికత, ఆవిష్కరణలను అభివృద్ధికి కీలక స్తంభాలుగా పరిగణించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ దార్శనికతతోనే దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ను పెంపొందించామని నేడు భారతదేశంలో 2,00,000 కంటే ఎక్కువ నమోదిత స్టార్టప్లు ఉన్నాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త ఇంజిన్గా ఉద్భవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ వృద్ధికి తన వంతు సహకారం అందిస్తోందని చెప్పారు. రాబోయే సంవత్సరాలలో భారతదేశ సహకారం నిరంతరం పెరుగుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో అనేక అవరోధాలు ఎదురైనప్పటికి భారత్ అత్యుత్తమ అభివృద్దిని సాధించిందని చెప్పారు. అలాగే, భారతదేశం అనేక సవాళ్లను అధిగమించిందని 11వ స్థానం నుంచి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గత దశాబ్దం తీవ్ర గందరగోళంతో నిండిపోయిందని అన్నారు. ‘‘ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సప్లై చైన్ల అంతరాయాలు వంటి తీవ్రమైన సవాళ్లను కూడా ప్రపంచం చూసింది. సంక్షోభ సమయాల్లో ఏ దేశానికైనా నిజమైన బలం, సామర్థ్యం బయటపడుతుందని చెబుతారు. ప్రపంచ అంతరాయాలు ఉన్నప్పటికీ, భారతదేశం తనను తాను నిరూపించుకుంది. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ దశాబ్దం భారతదేశానికి వృద్ది, అద్భుతమైన డెలివరీ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అదే సమయంలో గత ప్రభుత్వాలు సంస్కరణలను బలవంతంగా అమలు చేశాయని కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు గుప్పించారు. దేశం దివాలా ముప్పును ఎదుర్కొంటున్నప్పుడు 1991 సంస్కరణలను అమలు చేశారని ఆయన చెప్పారు. భారతదేశం తన బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చిందని అన్నారు. అటువంటి సంక్షోభం తర్వాతే ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ విధానం ఒక ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాలేదని మోదీ విమర్శలు గుప్పించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ ఆ సంఘటన తర్వాతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గ్రహించిందని అన్నారు. గతంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తే వరకు నిర్దిష్ట సంస్థాగత సంస్కరణలు అమలు చేయలేదని విమర్శించారు. అలాగే విద్యుత్ రంగం ఉదాహరణను కూడా మోదీ ప్రస్తావించారు. విద్యుత్ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, గ్రిడ్లు విఫలమవడం ప్రారంభించినప్పుడు, వ్యవస్థ కుప్పకూలినప్పుడు మాత్రమే సంస్కరణల గురించి చర్చించారని విమర్శలు గుప్పించారు. సంస్కరణలను బలవంతంగా అమలు చేసినప్పుడు వాటి ఫలితాలు ప్రభావవంతంగా ఉండవని, దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించవని మోదీ పేర్కొన్నారు. అందుకే గత 11 సంవత్సరాలుగా తాము దృఢ నిశ్చయంతో సంస్కరణలను అమలు చేశామని చెప్పడానికి తాను గర్విస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. విధానాలు మారినప్పటికీ మనస్తత్వం అలాగే ఉంటే ఖచ్చితంగా అమలు జరగకపోతే సంస్కరణలు కేవలం కాగితపు ముక్కలుగా మారుతాయని ఆయన అన్నారు. అందువల్ల మొత్తం వ్యవస్థను మార్చడానికి మేము నిజాయితీగా కృషి చేశామని చెప్పారు.