వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి

★ ఎన్డీయే సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

జనం న్యూస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుట్రల పట్ల కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుట్రల పట్ల కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీయే శాసనసభపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ...వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మతాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ చూస్తుందని ఆరోపించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హిందూ ధర్మంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి భక్తుడికి మతపరమైన బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని హిందువులు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా తన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...! ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము. ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే’’ అని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 17 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, ఒకవేళ అవసరమైతే సమావేశాలను పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఫిబ్రవరి 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇకపోతే ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 17,18 తేదీలలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్నారు.