
జనం న్యూస్: తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై కూడా కీలక ప్రకటన చేశారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తగ్గేది లేదని అన్నారు. వందకు వంద శాతం పట్టణాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుందని చెప్పారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిన ఆడబిడ్డల ఆనందం సభలో చూస్తుంటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన ప్రగతి తేజస్సు కనిపించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం శ్రమిస్తూ గడిచిన రెండేళ్లలో పేదవారి సంక్షేమానికి, భద్రతకు భరోసా కల్పించే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని తెలిపారు. గత పదేళ్ల పాలనలో పేదల ఆత్మగౌరవ చిహ్నమైన ఇండ్లను గత పాలకులు కట్టించలేదని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ తరువాత కూడా మరో మూడు విడతల్లో అర్హులైన పేదలకు సొంతిల్లు ఇస్తామని తెలిపారు. అదే విధంగా కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కొన్ని సర్వే నెంబర్లలో భూ వివాదాలు ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్న భూ యజమానులు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అటువంటి భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చటాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమించి, సర్వేలు ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే ఇలాంటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజల చల్లని దీవెనలు ఉండాలని... ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో అభివృద్ధి కాంక్షించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక, అంతకుముందు రేగొండ మండలం కొడవటంచ శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దర్శించుకున్నారు. అక్కడ దేవతామూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనాలను అందుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.