వేములవాడకు వెళ్తే పదవి పోతుందా.. ముగ్గురు సీఎంలకు షాక్.

*సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి బ్రేక్ చేస్తారా?

సాక్షి డిజిటల్ న్యూస్ : కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేములవాడకు రావాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానం పలకగా.. అక్కడికి వెళ్తే పదవి పోతుందని కొందరు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన సీఎం.. వేములవాడకు వెళ్తే పదవి పోతుందని కొందరు చెబుతున్నారని.. అయితే అది నిజం కాదని తాను నిరూపించేందుకు.. త్వరలోనే వేములవాడలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాలా పవర్‌ఫుల్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ వేములవాడ అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం కావడంతో దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. శివునితో పాటు విష్ణువు ఆలయాలు కూడా ఉండటంతో వేములవాడను హరిహర క్షేత్రం అని కూడా అంటారు. అయితే ఇంతటి శక్తివంతమైన ఆలయానికి వెళ్లాలంటే మాత్రం రాజకీయ నాయకులు జంకుతుంటారు. ఎందుకంటే.. ఈ వేములవాడకు వెళ్లిన కొందరు నేతలు.. ఆ తర్వాత కొన్ని రోజులకే పదవిని కోల్పోవడంతో.. చాలా మంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఇవాళ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. సీఎం రేవంత్ రెడ్డిని వేములవాడకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు సన్నిహితంగా ఉండే వారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. వేములవాడకు వెళ్లొద్దని.. అక్కడికి వెళ్తే తర్వాత పదవి పోతుందని ఆయన చెవిలో చెప్పారు. ఇప్పటికే ఇలాంటి అనుభవం చాలా మందికి జరిగిందని కూడా చెప్పారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా చొప్పదండిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టారు. వేములవాడకు వెళ్తే పదవి పోతుందని చెబితే విని తాను షాక్ అయ్యానని చెప్పారు. అలా ఎందుకు జరుగుతుందని అన్నారు. తాను తప్పకుండా వేములవాడకు వెళ్తానని.. ఈ ప్రచారాన్ని తప్పు అని త్వరలోనే నిరూపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం రూ.150 కోట్లు ఇస్తానని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి మోసం చేశారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం వేములవాడలో ఆలయ పునర్నిర్మాణ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *