ఏలూరులో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు

*అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ *సీఎం చంద్రబాబు నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ,లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు… 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ విద్యార్ధులు ప్రకృతి సాగు చేయడం ద్వారా దాని వల్ల వచ్చే ఫలితాలను స్వయంగా తెలుసుకునేలా చేయాలన్నారు. ప్రకృతి సాగుకు సంబంధించి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ వంటివి ఈ ఏడాది ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రమంతటా పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారు. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎల్‌నీనో ఎదుర్కొనేలా ప్రణాళికలు రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని… వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలన్నారు. రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేది… సమర్ధ నీటి నిర్వహణతో ఈ ఏడాది ఆ సమస్యను తీర్చాం… అన్ని రిజర్వాయర్లు నింపడంతో సాగునీటికి లోటు లేకుండా చేశామన్నారు. యూఎస్, ఈయూతో ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రాష్ట్రం నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు వివరించగా…, అయితే నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇకపై ఆక్వా సాగు నమోదు తప్పనిసరి ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలన్నారు. మామిడి, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు అవకాశాలు ఉన్నాయని… రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. అరటి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ… ఎగుమతుల విషయంలో వెనకబడ్డామని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్దఎత్తున కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను రైతులకే ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధం రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *