రికార్డు స్థాయి డిఫెన్స్ బడ్జెట్-సైన్యానికి కొత్త ఆయుధాలు?

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి చరిత్రలో రికార్డు స్థాయిలో కేంద్రం కేటాయింపులు జరిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజున లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి చరిత్రలో రికార్డు స్థాయిలో కేంద్రం కేటాయింపులు జరిపింది. ఆపరేషన్ సిందూర్‌కు అనంతర పరిణామాల నేపథ్యంలో... కేంద్ర బడ్జెట్‌లో రక్షణ సేవలకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించింది. ఈ స్థాయి కేటాయింపు... 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 15.19 శాతం గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీలో 2 శాతంగా ఉంది. మొత్తం రక్షణ రంగ బడ్జెట్... కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 14.67 శాతంగా ఉంది. అలాగే ఇది అన్ని మంత్రిత్వ శాఖలలోకెల్లా అత్యధికం. ఇందులో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు భారీగా కేటాయింపులు ఉన్నాయి. అయితే ఈ స్థాయి కేటాయింపులు భారత్‌పై కుట్రపూరితంగా వ్యవహరించే దాయాది పాకిస్తాన్‌కు వెన్నులో వణుకే అని చెప్పాలి. అయితే రక్షణ రంగ కేటాయింపులు సాయుధ దళాల ఆధునీకరణ, సాధారణ అవసరాలకు నిధులు సమకూర్చనున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత క్యాపిటల్, రెవెన్యూ అనే రెండు విభాగాల కింద ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసరంగా కొనుగోలు చేయడం వల్ల తలెత్తిన ఆర్థిక అవసరాలను కూడా తీరుస్తుంది. రక్షణ బడ్జెట్‌లో రూ. 2.19 లక్షల కోట్ల పెద్ద వాటాను మూలధన వ్యయం కోసం కేటాయించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ అంచనాలైన రూ. 1.80 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఈ పెంపు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు వ్యూహాత్మక మార్పుతో సాయుధ దళాలను, వాటి సామర్థ్యాలను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలకు తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చేసిన మొత్తం కేటాయింపులో... 27.95 శాతం మూలధన వ్యయం కోసం, 20.17 శాతం నిర్వహణ, కార్యాచరణ సంసిద్ధతపై రెవెన్యూ వ్యయం కోసం, 26.40 శాతం జీతాలు, భత్యాలపై రెవెన్యూ వ్యయం కోసం, 21.84 శాతం రక్షణ పెన్షన్ల కోసం, 3.64 శాతం పౌర సంస్థల కోసం ఉన్నాయి. సాయుధ దళాల ఆధునీకరణ వ్యూహాత్మక లక్ష్యం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ దళాలకు మూలధన విభాగం కింద బడ్జెట్ కేటాయింపు రూ. 2,19,306.47 కోట్లుగా ఉంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే 21.84 శాతం ఎక్కువ. ఇందులో రూ. 1.85 లక్షల కోట్లు మూలధన సేకరణ కోసం కేటాయించబడింది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూలధన సేకరణ బడ్జెట్ కంటే సుమారు 24 శాతం ఎక్కువ. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఆధునీకరణ బడ్జెట్‌లో ఈ భారీ పెరుగుదల ఒక వ్యూహాత్మక అవసరంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం వరకు అంటే డిసెంబర్ 2025 వరకు... రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 2.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటివరకు రూ. 3.50 లక్షల కోట్లకు పైగా అవసరాల ఆమోదాన్ని ఇచ్చింది. మూలధన సేకరణ కింద రాబోయే ప్రాజెక్టులు సాయుధ దళాలకు నెక్ట్స్ జనరేషన్ యుద్ధ విమానాలు, స్మార్ట్, లెథల్ ఆయుధాలు, నౌకలు/జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు, ప్రత్యేక వాహనాలు మొదలైన వాటిని సమకూర్చనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్‌లలో ఏర్పడుతున్న అంతరాయాలు, విదేశీ విక్రేతల కంటే దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేవలం మనుగడ కోసమే కాకుండా భవిష్యత్ ఆధునీకరణ కోసం రక్షణ రంగంలో 'దేశీయకరణ','దిగుమతుల ప్రత్యామ్నాయం' పై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. బడ్జెట్ విధానాల ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి నిధులను కేటాయించే రక్షణ మంత్రిత్వ శాఖ విధానం మరింత బలోపేతం చేయబడింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమల ద్వారా సేకరణ కోసం మూలధన సేకరణ బడ్జెట్‌లో 75 శాతం అంటే రూ. 1.39 లక్షల కోట్లను కేటాయించారు. ఈ విధంగా నిధులు కేటాయించడం ద్వారా దేశీయ సంస్థలకు వారి పెట్టుబడుల గురించి, సాయుధ దళాల సామర్థ్య అభివృద్ధిలో వారి పెరుగుతున్న పాత్ర గురించి భరోసా లభించింది. మూలధన సేకరణకు, ముఖ్యంగా దేశీయ పరిశ్రమలకు కేటాయింపులను పెంచడం జాతీయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అనేక అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దారితీసి... దేశంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. రక్షణ బడ్జెట్ రెవెన్యూ పద్దుల కింద ఖర్చుల కోసం రూ. 3,65,478.98 కోట్లను కేటాయించింది. ఈ కేటాయింపు 2025-26 బడ్జెట్ అంచనాల కేటాయింపు కంటే 17.24 శాతం ఎక్కువ. ఇందులో కార్యకలాపాలు, నిర్వహణ సంబంధిత ఖర్చుల కోసం రూ. 1,58,296.98 కోట్లు కేటాయించగా, మిగిలినది జీతాలు, భత్యాల కోసం కేటాయించబడింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఈ విషయంలో చేసిన బడ్జెట్ కేటాయింపు, కార్యాచరణపరంగా ముఖ్యమైన సామాగ్రి, విడిభాగాల సేకరణకు వీలు కల్పిస్తుంది... అలాగే, వాటి రోజువారీ అవసరాలను తీర్చడంతో పాటు కీలకమైన వ్యవస్థల నిర్వహణను నిర్ధారిస్తుంది. సరిహద్దుల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన సరిహద్దు రహదారుల సంస్థకు (BRO) అధిక కేటాయింపుల ద్వారా సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 7,146.50 కోట్ల నుంచి 2026-27 బడ్జెట్ అంచనాల కోసం బీఆర్వో మూలధనం కింద కేటాయించిన బడ్జెట్‌ను రూ. 7,394 కోట్లకు పెంచడం జరిగింది. ఈ కేటాయింపు సొరంగాలు, వంతెనలు, విమానాశ్రయాలు మొదలైన అనేక వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది. సరిహద్దు ప్రాంతాలలో చివరి మైలు కనెక్టివిటీని అందించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధిని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. మాజీ సైనికులకు ఆరోగ్య సంరక్షణ కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికులకు, వారిపై ఆధారపడిన వారికి ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS)కు కేటాయింపులను పెంచడం ద్వారా ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడానికి తన నిబద్ధతను చాటుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌లో ఈసీహెచ్ఎస్ కోసం రూ. 12,100 కోట్లు కేటాయించింది. ఇది ప్రస్తుత సంవత్సరం (2025-26) బడ్జెట్ అంచనాల దశలో చేసిన కేటాయింపు కంటే 45.49 శాతం ఎక్కువ. ఈ కేటాయింపు మాజీ సైనికుల వైద్య చికిత్స సంబంధిత ఖర్చులకు నిధులు సమకూరుస్తుంది. గత ఐదేళ్లలో ఈసీహెచ్ఎస్‌కి కేటాయింపులు 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల దశలో చేసిన కేటాయింపుతో పోలిస్తే 300 శాతం కంటే ఎక్కువగా పెంచబడ్డాయి. రక్షణ రంగంలో పరిశోధన,అభివృద్ధిని ప్రోత్సహించడం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కి బడ్జెట్ కేటాయింపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,816.82 కోట్ల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 29,100.25 కోట్లకు పెంచారు. ఈ కేటాయింపులో రూ. 17,250.25 కోట్ల ప్రధాన వాటా మూలధన వ్యయం కోసం కేటాయించబడింది. రక్షణ పెన్షన్ బడ్జెట్‌లో పెరుగుదల రక్షణ పెన్షన్ల కోసం మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ. 1,71,338.22 కోట్లుగా ఉంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల దశలో చేసిన కేటాయింపు కంటే 6.56 శాతం ఎక్కువ. ఈ నిధులను SPARSH, ఇతర పెన్షన్ పంపిణీ సంస్థల ద్వారా 34 లక్షల కంటే ఎక్కువ మంది పెన్షనర్లకు నెలవారీ పెన్షన్ పంపిణీ చేయడానికి ఖర్చు చేస్తారు.