సాక్షి డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిందితులపై FIR నమోదు చేసిన పోలీసులు

★నిందితులపై చట్టబద్ధ చర్యలు ప్రారంభం.

సాక్షి డిజిటల్ న్యూస్:మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్, జర్నలిస్ట్ "షేక్ మక్బూల్ బాష"పై ఈ నెల 15వ తేదీన ఎర్రగొండపాలెం ప్రధాన సెంటర్లో గల ఖాసీంపీరా టీ స్టాల్ దగ్గర జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎర్రగొండపాలెం పోలీసులు నిందితులపై 4 సెక్షన్లతో FIR నమోదు చేసి, బాధితుడికి FIR కాపీని అందజేయడం జరిగింది. ఈ కేసులో షేక్ ఇస్మాయిల్ (చికెన్ వ్యాపారి), షేక్ షఫీ (చికెన్ వ్యాపారి), ముక్తియార్, చోటు, సత్తార్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రారంభ దశలో ఫిర్యాదును NC పిటిషన్‌గా పరిగణించడంతో బాధితుడు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చి తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. చట్టం ప్రకారం కాగ్నిజబుల్ నేరంగా పరిగణించే దాడి ఘటనపై తక్షణమే FIR నమోదు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆలస్యం జరగడం పట్ల న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే నిరంతర న్యాయ ప్రయత్నాలు, చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం, ప్రజా స్థాయి చర్చల నేపథ్యంలో చివరకు FIR నమోదు కావడం ఈ కేసులో కీలక మలుపుగా భావించబడుతోంది. FIR నమోదు కావడంతో అధికారిక దర్యాప్తు ప్రారంభమవుతుందని, సాక్ష్యాల సేకరణ, నిందితుల పాత్రపై విచారణ చట్టబద్ధంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో, NC పద్ధతి కారణంగా బాధితులు ఎదుర్కొనే ఆలస్యం, భద్రతా భయాలు, న్యాయంపై నమ్మకం తగ్గే పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఒక వ్యక్తిగత కేసుగా మాత్రమే కాకుండా, కాగ్నిజబుల్ నేరాలపై FIR నమోదు విషయంలో పోలీస్ వ్యవస్థలో స్పష్టత, సమయపాలన అవసరాన్ని గుర్తుచేసే ఉదాహరణగా మారిందని, భవిష్యత్తులో ఇలాంటి ఆలస్యాలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.