
జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నందినగర్లోని గోడకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. స్వయంగా కేసీఆరే తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అని కేటీఆర్ మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని నిలదీశారు.చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం అని హెచ్చరించారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్కు సిట్ రెండోసారి నోటీసులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిక్వస్ట్ను సిట్ అధికారులు తిరస్కరించారు. రెండోసారి నోటీసులు శుక్రవారం జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఎర్రవెల్లి ఫామ్హౌస్లో విచారించాలన్న కేసీఆర్ రిక్వస్ట్ను సిట్ తిరస్కరించింది. అంతేకాదు ఇకపై ప్రతీ నోటీసులు కూడా ఫామ్ హౌజ్కే పంపించాలన్న రిక్వస్ట్ను సైతం సిట్ తిరస్కరించింది. అయితే కేసీఆర్ రిక్వస్ట్ను సిట్ దర్యాప్తు సంస్థ తిరస్కరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేసీఆర్ రిక్వస్ట్ను తిరస్కరించిన సిట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలతోపాటు ఇతర అధికారులను సైతం విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యుత్తరం పంపించారు. శుక్రవారం తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గడువు రేపు ఒక్కరోజే మాత్రమే ఉంది అని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు కాస్త సమయం కావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ను రిక్వస్ట్ చేశారు. అయితే కేసీఆర్ రిక్విస్ట్ను సిట్ తిరస్కరించింది.