
జనం న్యూస్: కేసీఆర్ పదేండ్లపాలనలో జరిగిన అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు. అర చేతితో సూర్యకాంతిని ఆపలేరని అంటారు. దీనికి తగ్గట్టే కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టలేరు అని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ డ్రామా ఆడుదాం అనుకుంది అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టులా అదే రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని ఎకనామిక్ సర్వే 2025-26 కళ్లకుకట్టింది అని చెప్పుకొచ్చారు. అర చేతితో సూర్యకాంతిని ఆపలేరని అంటారు. దీనికి తగ్గట్టే కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టాలని రేవంత్ బృందం ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినప్పటికీ కుదరట్లేదు అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరానికి, మిషన్ కాకతీయకు కితాబు! ‘ఆర్బీఐ, నీతిఆయోగ్ వంటి మేధో సంస్థలు, ‘ది ఎకానమిస్ట్’ వంటి అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు కేసీఆర్ పాలనను ఇప్పటికే వేనోళ్ల పొగిడారు.తాజాగా ఈ జాబితాలో కేంద్రప్రభుత్వం వెలువరించిన ఆర్థిక సర్వే 2025-26 కూడా చేరింది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.మరోవైపు 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉంటే అది 2023 ఆర్థిక సంవత్సరానికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు సర్వే వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్, మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, చెరువుల పునరుజ్జీవనానికి ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాలతోనే రాష్ట్రంలో సాగు విప్లవం సాధ్యమైందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. అలా తొమ్మిదేండ్ల వ్యవధిలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించినట్టు ప్రశంసించింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జనవరి 30న అనగా శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.ఇటీవలే ఇదే కేసులో మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావును కూడా సిట్ విచారించింది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది.65 ఏళ్ల వయసు కావడంతో ఎక్కడ విచారణకు హాజరుకావాల్సింది అనేది కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అని నోటీసుల్లో పేర్కొంది. 1973 సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వయోభారంతో ఉన్నవారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కేసీఆర్కు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడకు వచ్చి సిట్ బృందం విచారిస్తుంది అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. హాజరుకాలేనని కేసీఆర్ ప్రత్యుత్తరం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యుత్తరం పంపించారు. శుక్రవారం తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గడువు రేపు ఒక్కరోజే మాత్రమే ఉంది అని లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో తనకు కాస్త సమయం కావాలని కోరారు. మరోవైపు ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్లోనే విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు.అయితే రేపటి విచారణకు వాయిదా వేయాలని కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత విచారణ చేపట్టాలని. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు. సిట్ సమాధానంపై ఉత్కంఠ ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల దర్యాప్తు విషయంలో కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చారు. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారు. 2025 జూన్లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకూ సమయం కావాలి కేసీఆర్ కోరారు. అందుకే కమిషన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇదే తరహాలో గడువు ఇస్తారా? లేక రేపే విచారణ చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే నేడు తేదీ మార్చి మరోసారి సిట్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది అని తెలుస్తోంది.