మేడారం జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

* రాష్ట్రాభివృద్ధికి సమిష్టి కృషి అవసరం.

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ తల్లుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా, గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీగా నిధులు కేటాయించి మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనదేవతల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అవుతాం. ‘గిరిజన ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, నలుదిశలా తోరణాలను నిర్మించడమే కాకుండా, లక్షలాదిగా నిరంతరం మేడారానికి తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించిందన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి భక్తులు సహకరించాలి. నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి ఫోన్‌లో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉంటూ మహాజాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *