
పయనించే సూర్యుడు న్యూస్ : భారత సైన్యంతో వెళ్తున్న ఓ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో జవాన్లు మృతి చెందారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఆర్మీ వాహనం లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది సైనికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు ఆర్మీ వాహనం దోడాలోని భదేర్వా చంబా రోడ్డుపై వెళుతుందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా వైద్య సేవలకు పంపించారు. సైనికులను బయటకు తీసుకురావడానికి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సంతాపం భదేర్వా-చంబా రహదారిలోని ఖన్నిటాప్ వద్ద ఆర్మీ వాహనం ఢీకొన్న విషాద ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరిగిన సైనికుల కుటుంబాలకు ఆయన హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ఘటనపై వేగంగా స్పందించి రక్షణ, తరలింపు ప్రయత్నాలు చేసిన వారిని ఆయన ప్రశంసించారు. ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందిస్తూ, "దోడాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మన ధీరులైనా 10 మంది భారత సైన్యం సైనికుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను" అని సోషల్ మీడియాలో పేర్కోన్నారు. మన ధైర్య సైనికుల అత్యున్నత త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. దుఃఖిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని ఆయన అన్నారు.