ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు మారకూడదు

★ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించింది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వం వేధించదు అండగా ఉంటుంది. ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి.బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి. 2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలి’ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. క్లీన్ ఎనర్జీ పాలసీతో విధానపరమైన స్పష్టత ఇచ్చాం ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక అడుగు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఏఎం గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందందాయకం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. ‘క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. గ్రీన్ అమ్మోనియా రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో బలమైన అడుగు ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన సాయంతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పూర్తిగా క్లీన్ చేస్తుంది. ‘ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ Uniper తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత దేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న తొలి శుద్ధ ఇంధన ఎగుమతి ఒప్పందం. క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయడం, ఫార్మా, రసాయిన, ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణంలో మార్పులను నిలవరించవచ్చు. ఒక్క సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గించినా బలమైన మార్పు వస్తుంది. ఉప్పాడలో సముద్ర జలాలు ముందుకు వచ్చేస్తున్నాయంటే అందుకు భూతాపం పెరగడమే కారణం. ఇలాంటివి తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ క్రూడ్ ఆయిల్ ప్రమేయంలేని గ్రీన్ ఎనర్జీ తయారికీ పెద్దపీట వేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలగనున్నాయి. ఇది రాష్ట్రాన్ని విద్యుత్ రంగ సంక్షోభం నుంచి బయటపడేస్తుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘గత ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి, పునః సమీక్ష పేరిట విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. కియా లాంటి సంస్థ ప్రతినిధులపై కూడా బహిరంగ బెదిరింపులకు దిగారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెట్టుబడిదారులకు సహకరిస్తూ.. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానస సభ్యులు, కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు, ఏఎం గ్రీన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.