జనం న్యూస్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పండుగ కానుకగా రూ. 277 కోట్ల నిధులను విడుదల చేసింది. మంగళవారం (జనవరి 13) రోజున ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్థిక శాఖ అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. అలాగే ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆమోదం తెలుపడంతో ఆర్థిక శాఖ అధికారులు గ్రామ పంచాయతీలకు రూ. 277 కోట్లను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్లో కూడా ఒక పోస్టు చేశారు. ‘‘నూతన పంచాయతీలకు పండుగ సందర్భంగా ప్రజా ప్రభుత్వం తీపి కబురు. పల్లెలను అభివృద్ధి పరుస్తూ, పండుగ వాతావరణంలో ప్రజలందరూ సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా గ్రామ పంచాయతీల అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన విధంగా రూ. 277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయడం జరిగింది. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.సంక్రాంతి శుభకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంపదను తెచ్చే భోగి, కొత్త వెలుగును, ఆశను అందించే సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి చేరేలా చూడటమే ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవా రంగంలో తెలంగాణ అసమానమైన ప్రగతిని సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.