బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దుపై పరిశీలన

★ సెక్షన్ 80C సహా పన్ను మినహాయింపుల తొలగింపుపై అంచనాలు

పయనించే సూర్యుడు న్యూస్ : మరో రెండు వారాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ 2026లో తీసుకునే నిర్ణయాలపై అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారని, కొత్త పన్ను విధానం ఒక్కటే అమలులో ఉంటుందనే వాదన వినిపిస్తుంది. అందుకు కొన్ని బలమైన కారణాలు సైతం ఉన్నాయి. మరి బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో ఒక కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2026లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదాయపు పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడంలో భాగంగా, కొత్త పన్ను విధానాన్ని ఏకైక, తప్పనిసరి విధానంగా మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. పాత పన్ను విధానం రద్దు చేసే నిర్ణయం తీసుకునేందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సరళీకరణ లక్ష్యం: ప్రస్తుతం దేశంలో రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. పాత విధానంలో అనేక మినహాయింపులు తగ్గింపులు ఉన్నాయి. దీనివల్ల పన్ను లెక్కింపు క్లిష్టంగా మారుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఎలాంటి మినహాయింపులు లేని, తక్కువ పన్ను రేట్లు ఉండే కొత్త విధానం వైపు పన్ను చెల్లింపుదారులను మళ్లించాలని ప్రభుత్వం చూస్తోంది. కొత్త పన్ను విధానం: గత రెండు బడ్జెట్‌ల నుంచి ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని 'డీఫాల్ట్' విధానంగా మార్చింది. అంటే, పన్ను చెల్లింపుదారులు ప్రత్యేకంగా ఎంచుకోకపోతే వారు కొత్త విధానం కిందకే వస్తారు. బడ్జెట్ 2026లో ఈ కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి పాత విధానాన్ని పూర్తిగా తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. పన్ను చెల్లింపుదారులపై ప్రభావం: పాత పన్ను విధానంలో సెక్షన్ 80C, 80D, హోమ్ లోన్ వడ్డీ వంటి మినహాయింపులు పొందుతున్న వారికి ఈ మార్పు ఆందోళన కలిగించే విషయమే. అయితే, ప్రభుత్వం కొత్త విధానంలో పన్ను స్లాబ్‌లను మార్చడం లేదా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ పన్ను నమూనా: గతంలో కార్పొరేట్ కంపెనీలకు కూడా ఇలాగే రెండు రకాల విధానాలు ఇచ్చి, తర్వాత మినహాయింపులు లేని సరళమైన విధానాన్ని స్థిరపరిచారు. అదే నమూనాను ఇప్పుడు వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాత పన్ను విధానాన్ని ఒకేసారి రద్దు చేస్తారా లేక దశలవారీగా తొలగిస్తారా అనేది బడ్జెట్ 2026 ప్రసంగంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మినహాయింపులపై ఆధారపడే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఈ నిర్ణయంపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెక్షన్ 80C ద్వారా ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80D ద్వారా ఆరోగ్య బీమాపై రూ.50 వేల వరకు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 10 (13ఏ) కింద హౌస్ రెంట్ అలవెన్స్‌పై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24బీ ప్రకారం హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపు పొందొచ్చు. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా సెక్షన్ 80సీసీసీడీ (1బీ) ద్వారా రూ.50 వేలు అదనంగా మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ బెనిఫిట్స్ ఏవీ కొత్త పన్ను విధానంలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. పాత పన్ను విధానం రద్దయితే ఈ బెనిఫిట్స్ అన్ని పోతాయి.