
జనం న్యూస్ శంకరపట్నం 10/01/2026: పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే, సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంచాయితీ కార్యదర్శులు, కారోబారులు, మధ్యవర్తులను పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్న ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొత్తగట్టు గ్రామంలో గ్రామ పంచాయతీ కారోబార్ నో డ్యూ సర్టిఫికెట్ కై ఓ వ్యక్తి నుండి డబ్బులు డిమాండ్ చేసినట్లు జనం న్యూస్ ప్రతినిధికి ఆధారాలు సమర్పించారు. జనం న్యూస్ ప్రతినిధి పంచాయతీ కార్యదర్శిని వివరణ అడగగా అలాంటిది ఏమీ లేదని మాట దాటవేశాడు.ఇంటి పన్ను, నల్ల బిల్లు సక్రమంగా, సకాలంలో చెల్లించిన వ్యక్తికి 24 గంటల్లోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలని మండల స్థాయి అధికారులు తెలిపారు. మండల పరిధిలోని కొందరు కారోబార్లు, గ్రామ పంచాయతీ అధికారులను, ప్రజా ప్రతినిధులను మచ్చికగా చేసుకుని, మండల స్థాయి అధికారులతో సఖ్యతగా మెలుగుతూ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. అక్రమార్జనకు పాల్పడిన కారోబారులపై, పంచాయతీ కార్యదర్శులపై మండల అధికారులు, జిల్లా అధికారులకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.