RTC బస్సులో సీఎం రేవంత్ రెడ్డి

★ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 'పూలే' సినిమాకు వెళ్లిన రేవంత్

జనం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ‘పూలే’ సినిమా వీక్షించారు. సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవితాలను, వారి త్యాగాలను తెలిపే ఈ చిత్రాన్ని వీక్షించడం ద్వారా నేటి తరానికి స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మూవీ చూసేందుకు బస్సులో జర్నీ చేశారు. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు ఆయన బస్సులో బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి శాసనసభ ప్రాంగణం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్స్‌కు బయలుదేరారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడుతూ రేవంత్ ప్రయాణం సాగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో పోలీసులు మార్గ మధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలు అందరూ ఒకే బస్సులో సామాన్యుల తరహాలో ప్రయాణించడం ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీబాయి పూలే సమాజం కోసం చేసిన త్యాగాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి సావిత్రీబాయి పాత్రలో పత్రలేఖ పాల్ నటించారు. వీరిద్దరి నటన చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. హిందీ భాషలో రూపొందిన ఈ చిత్రం 2025 ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశంలో కుల నిర్మూలన కోసం పూలే చేసిన పోరాటం, ముఖ్యంగా మహిళా విద్య కోసం సావిత్రీబాయి పూలే ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వారు పడ్డ కష్టాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా వీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పూలే దంపతుల సేవలను కొనియాడారు.