2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం..

★ప్రధాని మోదీ కీలక ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : 2036 ఒలింపిక్ గేమ్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లో నిర్వహించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలో అహ్మదాబాద్ కేంద్రంగా భారీ ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ప్రపంచ క్రీడా వేదికపై భారత్ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ బాధ్యతలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్ పూర్తి బలంతో ముందడుగు వేస్తోందని ఒక క్రీడా కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. అంతేకాకుండా 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా మన దేశంలోనే జరుగుతాయని వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం దాదాపు రూ. 34,700 కోట్ల నుంచి రూ. 64,000 కోట్ల వరకు బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికగా భారత్‌ను నిలబెట్టేందుకు క్రీడాకారుల శిక్షణ, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ ప్రకటన ద్వారా అంతర్జాతీయ క్రీడా సమాజంలో భారత్ ప్రాధాన్యతను పెంచాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముమ్మరంగా సన్నాహాలు: ఒలింపిక్స్ నిర్వహణపై భారత్ 2019 నుంచే ఆసక్తి చూపిస్తోంది. దీనికోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో నిరంతరం చర్చలు జరుపుతోంది. 2023లో ముంబైలో జరిగిన ఐఓసీ సమావేశం మన బిడ్ ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చింది. గతంలో 1951, 1982 ఆసియా గేమ్స్, 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన అనుభవం భారత్‌కు ఇప్పుడు కలిసి రానుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ వంటి ప్రపంచ స్థాయి స్టేడియాలు ఇప్పటికే సిద్ధంగా ఉండటం మనకు అదనపు బలం. ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కితే దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగం భారీగా పుంజుకుంటాయి. అయితే ఈ పోటీలో భారత్‌తో పాటు టర్కీ, ఇండోనేషియా, జర్మనీ వంటి దేశాలు కూడా రేసులో ఉన్నాయి.