న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ పింఛన్‌ దారులకు ముందస్తు చెల్లింపులు

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ (2026 జనవరి 1) నేపథ్యంలో ఆరోజు కాకుండా ఒక్క రోజు ముందే పింఛన్‌ల పంపిణీ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆరోజు సెలవురోజు ఉంటే ముందు రోజే పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నెలలో ఒకటో తేదీ ఆదివారం, ఏదైనా పండుగ ఉంటే... ముందు నెల చివరి రోజునే లబ్దిదారుల చేతికి పింఛన్ అందజేస్తుంది. తాజాగా మరోసారి ఒక్క రోజు ముందుగానే లబ్దిదారుల చేతికి పింఛన్ డబ్బులు అందజేస్తుంది. న్యూ ఇయర్ (2026 జనవరి 1) నేపథ్యంలో ఆరోజు కాకుండా ఒక్క రోజు ముందే పింఛన్‌ల పంపిణీ చేపట్టింది. కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే బుధవారం (డిసెంబర్ 31) ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా పింఛన్ పంపిణీ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ.2,743 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇదిలాఉంటే, ఏపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పింఛన్ పెంపు చేపట్టిన సంగతి తెలిసిందే. 2024 జూలై నుంచే పెంచిన పింఛన్‌ను అందజేస్తుంది. సామాజిక పింఛన్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3 వేలు ఉంటే.. కూటమి ప్రభుత్వం దానిని రూ. 4 వేలకు పెంచింది. దివ్యాంగులకు రూ.3000గా ఉన్న పింఛన్‌ను రూ. 6000 చేసింది. పూర్తి వైకల్యం ఉన్న వారికి పింఛన్‌ను రూ.15 వేలకు పెంచింది. సీఎం చంద్రబాబు ట్వీట్. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సీఎం చంద్ర‌బాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. కొత్త ఏడాది మంచి జరగాలని కోరుకుంటూ ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు పెట్టామని చెప్పారు. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటు చేశామని తెలిపారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.