
పయనించే సూర్యుడు న్యూస్ : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బెంగాల్లో అడుగు పెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. సరిహద్దుల్లో కంచె వేయకుండా అడ్డుకుంటూ, చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 'నేషనల్ గ్రిడ్' ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క అక్రమ వలసదారుడిని రాష్ట్రం నుంచి తరిమికొడతామని శపథం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. కోల్కతా పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ను పట్టి పీడిస్తున్న చొరబాటుదారులు, అవినీతి, హింసాత్మక రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బెంగాల్ను చొరబాటుదారుల నుంచి విముక్తి చేస్తామని భారీ హామీ ఇచ్చారు. చొరబాటుదారులు జాతీయ భద్రతకు ముప్పు రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీయుల చొరబాటును ప్రోత్సహిస్తోందని అమిత్ షా ఆరోపించారు. "చొరబాటు అనేది కేవలం బెంగాల్ సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం దేశ భద్రతకు సంబంధించిన అంశం. సరిహద్దుల్లో కంచె వేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించకుండా అడ్డుకుంటోంది. అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో చొరబాటును అడ్డుకోగలిగినప్పుడు బెంగాల్లో ఎందుకు జరగడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులను గుర్తించి వారిని రాష్ట్రం నుంచి తరిమికొడతామని స్పష్టం చేశారు. అవినీతికి మారుపేరుగా బెంగాల్ గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని అమిత్ షా మండిపడ్డారు. "చిట్ఫండ్ స్కామ్ల నుంచి స్కూల్ జాబ్ స్కామ్ల వరకు, బొగ్గు నుంచి పశువుల అక్రమ రవాణా వరకు టీఎంసీ నాయకులు, మంత్రుల పేర్లు ప్రతి స్కామ్లోనూ వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన మంత్రులు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. మమతా పాలనలో రాష్ట్రం 'టోల్ సిండికేట్'కు కేంద్రంగా మారింది" అని విమర్శించారు. కేంద్రం అందించే సంక్షేమ పథకాలు కూడా బెంగాల్ ప్రజలకు అందకుండా టీఎంసీ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన, సందేశ్ఖాలీ ఉదంతాలను ప్రస్తావిస్తూ మహిళా ముఖ్యమంత్రి పాలనలోనే మహిళల భద్రత అట్టడుగు స్థాయికి పడిపోవడం దురదృష్టకరం అన్నారు. "మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ బెంగాల్లో పరిస్థితి చూస్తుంటే మనం మొఘల్ కాలంలో ఉన్నామా? అన్నట్లుగా ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు. 2016 నుంచి బెంగాల్లో బీజేపీ ఓటు శాతం, సీట్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని 2026లో రెండు వంతుల మెజారిటీతో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని పునరుద్ధరిస్తామని, పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఏప్రిల్ 2026 తర్వాత రాష్ట్రంలో కొత్త శకం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.