న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

★ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

జనం న్యూస్: హైదరాబాద్ మహా నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహా నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ఐటీ కారిడార్‌‌ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. క్యాబ్, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు. బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, ఈవెంట్‌ల నిర్వాహకులకు. వేడుకల్లో పాల్గొనే ప్రజలకు. సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి ఈ అడ్వైజరీ అమలులోకి వస్తుందని తెలిపారు. క్యాబ్, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు సరైన యూనిఫాం ధరించాలని స్పష్టం చేశారు. అలాగే వాహనానికి, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. అదే సమయంలో రైడ్ నిరాకరించడం సెక్షన్ 178 ఎంవీఏ కింద నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. న్యూ ఇయర్ వేళ రైడ్‌లపై అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని, కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించకూడదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు... వాట్సాప్ నంబర్ 9490617346‌లో సంప్రదించాలని సూచించారు. బార్లు, పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు మద్యం మత్తులో ఉన్న కస్టమర్లను డ్రైవ్ చేయడానికి అనుమతించవద్దని తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించడం, సురక్షితమైన రవాణాను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాధారణ ప్రజలు రాంగ్-సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, టూ వీలర్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, పార్కింగ్ ఉల్లంఘనలను పాల్పడితే గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. సైబరాబాద్ అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహన తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకపోతే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించింది. మైనర్లు డ్రైవింగ్‌ చేసినట్టయితే వాహనం సీజ్ చేసి, ప్రాసిక్యూషన్ చేయనున్నట్టుగా వెల్లడించింది. మద్యం తాగి వాహనం నడపిడే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మొదటి సారి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10,000 వరకు జరిమానా / 6 నెలల వరకు జైలు శిక్ష... మరోసారి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 15,000 వరకు జరిమానా / 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వత రద్దుకు అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు. వాహనదారులు ప్రాణాంతక ప్రమాదానికి కారణమైన బీఎన్ఎస్ 2023 కింద అరెస్టు తప్పదని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.