
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 10 వరకు ఈ జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుండి రావాల్సిన సుమారు రూ.700 కోట్ల నిధుల కోసం వచ్చే మార్చిలోగా ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘాలకు కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఈ కసరత్తు కీలకం కానుంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఓటర్ల నమోదు ముమ్మరంగా సాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు , కార్పొరేషన్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 నగర పాలక సంస్థలలో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2026 జనవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ముఖ్యంగా నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్లలో ఈ ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ వెనుక ఉన్న కారణాలు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు అనివార్యంగా మారింది. దీనికి ప్రధాన కారణాల్లో కేంద్ర నిధుల రాక ఒకటి. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు 700 కోట్ల రూపాయల నిధులు రావాలంటే.. మార్చి నాటికి ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఎన్నికైన పాలకవర్గాలు లేకపోతే ఈ నిధుల విడుదలలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే 117 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగిసి సుమారు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులు ఉంటేనే వార్డుల స్థాయిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ గడువు ముగుస్తుంది. అలాగే మే నెలలో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి ప్రధాన నగరాల పాలకవర్గాల గడువు కూడా పూర్తికానుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలా లేక విడతల వారీగా వెళ్లాలా అనే అంశంపై సమాలోచనలు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా మున్సిపల్ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా వంటి ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక అభివృద్ధిలో ఓటు అనేది కీలక ఆయుధమని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ప్రభుత్వం కోరుతోంది.