
జనం న్యూస్: ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులో 5 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఇకపోతే రాబోయే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాబోయే రెండు, మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని...ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పగటిపూట ఎండలు కాస్తున్నప్పటికీ రాత్రి అయ్యేసరికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గాలులు మరింత పెరిగి చలి తీవ్రత దారుణంగా ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. గజగజ వణికిపోతున్న ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ను చలి గజగజ వణికిస్తోంది. ఈ ఏడాది చలి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలితో గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. శుక్రవారం ముంచంగిపుట్టు మండలం కిలగూడలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత 20 రోజులుగా అరకు, పాడేరు, చింతపల్లి, వై.రామవరం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 12 డిగ్రీల మధ్య నమోదవుతుంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రత 4 డిగ్రీలకే పడిపోయాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు చలికి వణికిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన శీతల గాలులు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ శుక్రవారం ప్రభావం పెరిగింది. 2021 నుండి 2024 వరకు ఎల్నినో ప్రభావం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి చలి తక్కువగా ఉండేది. కానీ ఈ ఏడాది పరిస్థితులు తలకిందులయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుండి అతి శీతల గాలులు నేరుగా మన రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు ప్రభావంతో శీతల తరంగాలు ఒడిశా మీదుగా మన రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి.దీంతొ ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది చలి తీవ్రత తారాస్థాయికి చేరింది.