
పయనించే సూర్యుడు న్యూస్ : రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఈసారి కూడా ఏ పార్టీకి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ ఏడాదిలో ఏకంగా రూ.6 వేల కోట్లకుపైగా విరాళాలను తమ ఖాతాలో వేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే చాలా వెనుకంజలో నిలిచింది. ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత కూడా బీజేపీకి నిధుల ప్రవాహం తగ్గకపోగా.. మరింత పెరగడం విశేషం. మరోవైపు.. ప్రాంతీయ పార్టీలకు భారీగా విరాళాలు తగ్గిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన నివేదికలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత రాజకీయ నిధుల సమీకరణలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విరాళాల సేకరణలో సరికొత్త రికార్డును సృష్టించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన నివేదికల ప్రకారం. ఈ ఏడాది ఏకంగా రూ. 6,088 కోట్లు విరాళాల రూపంలో బీజేపీకి అందాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అందుకున్న విరాళాల (రూ. 522.13 కోట్లు) తో పోల్చితే బీజేపీకి ఏకంగా దాదాపు 12 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత కార్పొరేట్ సంస్థలు.. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా తమ విరాళాలను భారీగా మళ్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ. 3,967 కోట్లుగా ఉన్న బీజేపీ విరాళాలు.. ఈ ఏడాది ఏకంగా 53 శాతానికి పైగా పెరగడం గమనార్హం. దీంతో ఈ ఏడాది రూ. 6,088 కోట్ల విరాళాలు కమలం పార్టీకి వచ్చాయి. బీజేపీకి అందిన మొత్తం నిధుల్లో సుమారు 52 శాతం అంటే రూ. 3,142.65 కోట్లు ఎలక్టోరల్ ట్రస్టుల నుంచే రావడం గమనార్హం. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఈ ఏడాది అతిపెద్ద దాతగా నిలిచింది. ఈ ట్రస్ట్ వివిధ పార్టీలకు పంచిన మొత్తం రూ. 2,668 కోట్లలో ఎక్కువభాగం బీజేపీకే ఇవ్వడం గమనార్హం. ఈ ఆర్థిక ఏడాదిలో బీజేపీకి నిధులు భారీగా పెరగగా కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల విరాళాలు గణనీయంగా తగ్గిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి గతేడాది రూ. 1,129 కోట్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి సగానికిపైగా తగ్గిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది హస్తం పార్టీకి కేవలం రూ. 522.13 కోట్లకే పరిమితమైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), బిజూ జనతా దళ్ (బీజేడీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వంటి పార్టీలకు కూడా విరాళాలు భారీగా తగ్గడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్: రూ. 140.05 కోట్లు (గతేడాది రూ. 184 కోట్లు). టీడీపీ: రూ. 85.20 కోట్లు (గతేడాది రూ. 274 కోట్లు). ఎలక్టోరల్ బాండ్లు రద్దు అయిన తర్వాత.. కార్పొరేట్ కంపెనీలు తమ నిధులను నేరుగా లేదా ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్లు లేకపోవడంతో కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ ట్రస్టుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. కేవలం ప్రూడెంట్ ట్రస్ట్ ద్వారానే 15 రాజకీయ పార్టీలకు నిధులు అందడం గమనార్హం. అందులో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వేదాంత లిమిటెడ్, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు పార్టీలకు విరాళాలు ఇచ్చిన ప్రధాన దాతల జాబితాలో నిలిచాయి. వ్యయం - ఆదాయం అంచనా ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ రూ. 522 కోట్ల ఆదాయం పొందగా.. ఎన్నికల ప్రచారం, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ. 1,111.94 కోట్లు ఖర్చు చేసినట్లు తన ఆడిట్ నివేదికలో పేర్కొంది. అంటే ఆదాయం కంటే ఖర్చు రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో నిధుల సమీకరణలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత కూడా అధికార పార్టీకి నిధుల ప్రవాహం తగ్గకపోగా.. మరింత పెరగడం విశేషం.