
సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రెండు కీలక పథకాల ద్వారా రూ.37,407 కోట్లు నిధులు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉద్యాన హబ్, పూర్వోదయ పథకాల కింద రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. ఈ పథకాలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఈ రెండు పథకాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంది. రాష్ట్రానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుండటంతో.. రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో తెచ్చిన పథకాలకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను పరిశీలించి.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు కీలక పథకాల ద్వారా ఏపీకి రూ.37,407 కోట్లు నిధులు రాబట్టేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఉద్యాన హబ్, పూర్వోదయ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టేందుకు ప్రణాళికలు రెడీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా.. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన హబ్ రూపకల్పనకు అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. అలానే పూర్వోదయ పథకం కోసం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలను ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో ఆయకట్టుకు నీరందించి రైతులకు మరింత మేలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకాలకు నిధులిచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రికి దీనికి సంబంధించిన నివేదికలను సమర్పించారు. కేంద్రం ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే పూర్వోదయ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలో వెనకబడిన ప్రాంతాలను.. పలు రంగాల్లో ముందుకు తీసుకువచ్చేందుకు గాను ఈ పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది. 2026 ఏడాదిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ఈ పథకానికి ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు దేశంలోని ప్రజలు, దేశీయ అవసరాలకు, ఎగుమతులకు సరిపడా కూరగాయలు, పండ్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని.. దిగుబడి పెంచడం కోసం సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఉద్యాన హబ్ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాతో పాటుగా.. రాయలసీమ ఆరు జిల్లాల్లోనూ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి కొత్తగా 8,87,447 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని, 4,30,338 ఎకరాలు స్థిరీకరించాలని ప్రణాళిక రచించింది.