లోక్‌సభలో తీవ్ర గందరగోళం, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను చించేసి.. నిరసనలు, నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే ఈ కొత్త బిల్లు ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టం ప్రకారం పథకం పేరు మార్చడమే కాకుండా కూలీల పనిదినాలు, రోజు వారీ వేతనం పెంచనున్నారు. 20 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' స్థానంలో కొత్త చట్టం వచ్చింది. 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ' బిల్లు-2025కు గురువారం లోక్‌సభలో ఆమోదం లభించింది. ప్రతిపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఉపాధి హామీ పనిదినాలను ప్రస్తుతం ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో ఈ బిల్లు ప్రతులను చింపివేసి తమ నిరసనను తెలిపారు. మంగళవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైనప్పటి నుంచి.. 'జీ రామ్ జీ' బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది. బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చ జరిగిందని స్పీకర్ ఓం బిర్లా పేర్కొనడంతో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వెల్‌లోకి దూసుకెళ్లి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ బిల్లు కాపీలను చింపి గాలిలోకి విసిరారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. కాగితాలు చింపడానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఇక్కడికి పంపించలేదని ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఏం జరుగుతోందో దేశ ప్రజలు గమనిస్తున్నారని మందలించారు. అనంతరం గందరగోళం మధ్యే వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుకు ఆమోదం లభించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు ఈ కొత్త బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును చట్టం నుంచి తొలగించడం ఆయనను అవమానించడమేనని విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం అధిక శాతం నిధులు ఇచ్చేదని.. ఇప్పుడు 60:40 నిష్పత్తిలో నిధుల భారం పడటం వల్ల పేద రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేవని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఈ చట్టం వల్ల ఉపాధి హామీ పథకం క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ కొత్త బిల్లును సమర్థిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పాత చట్టం అవినీతికి నిలయంగా మారిందని.. కొత్త చట్టం పారదర్శకతను తీసుకువస్తుందని పేర్కొన్నారు. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధిని పెంచడం ద్వారా గ్రామీణ పేదలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అన్ని పథకాలకు జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టిందని.. ఇప్పుడు పేర్లు మార్చడంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం పనిపైనే దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.