పయనించే సూర్యుడు న్యూస్ : అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి పాకిస్థాన్ దుర్మార్గాలను ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ను “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం”గా అభివర్ణించిన భారత్.. ఆ దేశ రాజకీయ సంక్షోభాన్ని లక్ష్యంగా చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు పాలు చేసి, సైన్యాధిపతి అసిమ్ మునీర్కు జీవితకాల రక్షణ కల్పించడం పాకిస్థాన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని భారత ప్రతినిధి హరీష్ పర్వతనేని తీవ్రంగా విమర్శించారు. దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్ర దాడుల కారణంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు కూడా భారత్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో “శాంతికి నాయకత్వం” అనే అంశంపై జరిగిన బహిరంగ చర్చలో భారత్ మరోసారి పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత్కు నష్టం కలిగించే ఆలోచనలకే పాక్ అంకితమైందని ధ్వజమెత్తింది. ముఖ్యంగా పాక్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ను ‘పరిష్కారం కాని వివాదం’గా ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీష్ పర్వతనేని దీనిై స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం అని, అవి ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు అలాగే సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతకు గల కారణాలను వివరిస్తూ.. పర్వతనేని పాకిస్థాన్ను ఏకంగా “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం”గా అభివర్ణించారు. ఆరు దశాబ్దాల క్రితం భారత్ సద్భావనతో ఈ ఒప్పందంలో భాగమైనప్పటికీ.. పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్ర దాడుల ద్వారా ఈ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆరోపించారు. గత నాలుగు దశాబ్దాలలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర దాడుల్లో వేలాది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిని కూడా ఆయన ఉదహరించారు. ఒక మాజీ ప్రధాని (ఇమ్రాన్ ఖాన్)ని జైలు పాలు చేయడం, పాలక పార్టీని (PTI) నిషేధించడం, 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యం ‘రాజ్యాంగ కుట్ర’కు పాల్పడి రక్షణ దళాల అధిపతి (అసిమ్ మునీర్)కు జీవితకాల రక్షణ కల్పించడం పాక్ ప్రజల మనోభావాలకు విరుద్ధమని అన్నారు. చివరగా.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో భారత్ తన శక్తి మేరకు తిప్పికొడుతుందని ఆయన హెచ్చరించారు. దీనికి ముందు పాక్ ప్రతినిధి అహ్మద్ మాట్లాడుతూ.. జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు.