జనం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. విద్యార్థుల మీద అభిమానంతోనే తాను ఇక్కడికి వచ్చానని, ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులు కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.45 లక్షల చెక్కును అందజేశారు. తాను ఓయూకు వస్తుంటే ఎందుకు ఇక్కడకు వెళ్తున్నారని తనను కొందరు ప్రశ్నించారని తెలిపారు. ఇక్కడకు రావాలంటే ఉండాల్సింది ధైర్యం కాదని.. అభిమానం అని సీఎం రేవంత్ తెలిపారు. విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఆ రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ.. వాటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, బుధవారం, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థులకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధి కోసం రూ. 45 లక్షల చెక్కును అందజేశారు. ఆ తర్వాత.. ఆర్ట్స్ కాలేజీ వద్ద ‘సర్వం సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చింది ధైర్యంతో కాదని, విద్యార్థుల గుండెల్లో తన మీద ఉన్న అభిమానంతో వచ్చానని అన్నారు. తన మనసులో ఉన్నది చెప్పడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి అన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో చదువు లేకపోయినా ఆధిపత్యాన్ని సహించరని సీఎం స్పష్టం చేశారు. ఓయూకు రూ. 1000 కోట్ల నిధులు విడుదల చేయడం, పూర్వ విద్యార్థులు రూ. 45 లక్షల చెక్కు అందించడం వంటివి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.