
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు తమకు ఆదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ తిరుగులేనిది.. అందరూ రైజింగ్లో భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభ ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతలను ఆదర్శంగా తీసుకొని, నిపుణులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్–2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రోడ్మ్యాప్ను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా... 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను CURE, PURE, RARE అనే మూడు జోన్లుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.‘కష్టమైతే వెంటనే చేస్తాం, అసాధ్యమైతే కొంత గడువు తీసుకొనైనా సాధించి తీరుతాం’అనే ధోరణితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.‘తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్.. — Come and join the rise’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజన్ లక్ష్యాల సాధన కోసం మూడు ప్రత్యేక మండళ్లుగా విభజన ‘దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుని ఉత్సవాలు చేసుకునే 2047 నాటికి యువ రాష్ట్రమైన తెలంగాణ ఏం సాధించగలదని నిపుణులతో ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) ఆలోచనలకు బీజం పడింది. భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్ణయించుకుని సాధించాలని సంకల్పించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో దేవుళ్ల ఆశీర్వాదం తీసుకోవడం, ప్రజల మద్దతు, సహకారం కోరడం మా సంప్రదాయం’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందించుకున్న విజన్ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాన్ని సేవా రంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం.. అన్న మూడు ప్రాంతాలుగా విభజన చేశాం. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొట్ట స్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్దేశించాం. వాటినే క్యూర్, ప్యూర్, రేర్ అన్న మూడు ప్రత్యేక మండళ్లుగా విభజన చేశాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), గ్రామీణ వ్యవసాయ రీజియన్ ఎకానమీ (RARE) ‘ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరాం. వారి అంచనాలు, ఆలోచనలు, కలలను మాతో పంచుకున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నాం. తెలంగాణ రైజింగ్ దార్శనికతను రూపొందించడంలో సహాయ పడినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు ఇందులో పాలుపంచుకోవడం తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాతల నుంచి ప్రేరణ పొందాం ‘వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ రెండు రోజుల సమ్మిట్లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ భవిష్యత్తుగా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి మేము ప్రేరణ పొందాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.