జనం న్యూస్ : హైదరాబాద్లో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కొత్వాల్గూడ ఎకో పార్కు సిద్ధమైంది. హిమాయత్సాగర్ సమీపంలో అంతర్జాతీయ పక్షి కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. అమెజాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి అరుదైన, రంగురంగుల పక్షులు ఇక్కడ సందర్శకులను అలరించనున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, పక్షుల ప్రపంచాన్ని దగ్గరగా చూసేవారికి ఇది ఒక అద్భుతమైన వేదిక కానుంది. టూరిస్టులకు నిజంగా ఇది గుడ్న్యూసే. హిమాయత్సాగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన, విమానాశ్రయానికి అతి దగ్గరలో ఈ అరుదైన అంతర్జాతీయ పక్షి కేంద్రం సందర్శకుల కోసం ప్రారంభానికి సిద్ధమవుతోంది. అమెజాన్ అడవులతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా దేశాల్లోని ప్రత్యేక జాతులకు చెందిన పక్షులన్నింటినీ ఇక్కడ ప్రదర్శించనున్నారు. మొత్తం 10 వేల రకాల పక్షులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే 1000 రకాల పక్షులను ఆరు నెలల క్రితమే తెచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తున్నారు. హిమాయత్సాగర్ చెంత మొత్తం 85 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఎకో పార్కును అభివృద్ధి చేయడానికి రూ. 150 కోట్లు వెచ్చించింది. ఇందులో అరుదైన పక్షి కేంద్రం 6 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో ల్యాండ్ స్కేపింగ్, బోర్డు వాక్, రెస్టారెంట్లు, కాటేజీలు, వినోదాలు, పర్యావరణ ఆకర్షణ ఉండేలా పార్కును తీర్చిదిద్దారు. ప్రధాన ఆకర్షణగా నిలవనున్న జాతులుఈ కేంద్రం బర్డ్ వాచింగ్ (పక్షులను వీక్షించడం), నేచర్ ఎడ్యుకేషన్ (ప్రకృతి విజ్ఞానం), పక్షులపై అధ్యయనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లతో రూపొందించారు. గతంలో ఎప్పుడూ చూడని బ్లూ అండ్ గోల్డ్ మేకా, గ్రీన్ వింగ్ మేకా, స్కార్లెట్ మేకా వంటి రంగురంగుల మేకా పక్షులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కకాటో (Cockatoo), ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, అమెజాన్ ప్యారెట్స్ వంటి తెలివైన చిలుకల జాతులు పర్యాటకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఫించెస్ , లవ్బర్డ్స్ లాంటి చిన్న పక్షులు వేల సంఖ్యలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. కాకటీల్ , గ్రౌస్, ప్యారాకిట్స్, క్వేకర్ పారాకీట్స్ మృదువైన స్వరంతో పర్యాటకులను స్వాగతించనున్నాయి. రెయిన్బో లోరీకీట్లు, టుర్కో, టౌకాన్లు, మాండరిన్ డక్స్ వంటి పెద్ద ముక్కు పక్షులు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ప్రారంభానికి సన్నాహాలు ఈ ప్రతిష్టాత్మక పక్షి కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. త్వరలోనే అధికారిక ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ కేంద్రం హైదరాబాద్ వాసులకు, పర్యాటకులకు పక్షుల ప్రపంచాన్ని దగ్గర చేసే ఒక అద్భుతమైన వేదిక కానుంది.