జనం న్యూస్ : ఏపీలో దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్రవాయుగుండం మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో (సోమవారం) సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిత్వా తుఫాను ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్వ దిశగా కదులుతోంది. మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1వ తేదీ (సోమవారం) దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవటంతో పాటుగా తీరం వెంబడి.. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు దిత్వా తుఫాను ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇక అత్యవసర సహాయం కోసం వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించారు. అలాగే వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.